న్యూఢిల్లీ : ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా ఆయన కేంద్ర రవాణా, ఉపరితల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు తన నివాసంలో. ఈ సందర్బంగా కీలక అంశాలపై చర్చించారు. దేశానికి సంబంధించిన కీలకమైన రవాణా, భద్రతా విషయాలపై కేంద్ర మంత్రితో చర్చించారు . ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఎంపీ బస్తిపాటి నాగరాజు కూడా ఉన్నారు. ఇటీవల బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరిగిన విషయాన్ని , ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడాన్ని ఈ సందర్బంగా టీజీ భరత్ గుర్తు చేశారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో బస్సు ప్రమాదంలో మంటల్లో చిక్కుకొని ప్రయాణికులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అధునాతన అగ్నిమాపక వ్యవస్థలపై ఆయన ఇదివరకు ఇచ్చిన వినతి మేరకు కొత్త ప్రయాణీకుల-బస్సు భద్రతా చట్టాన్ని తీసుకు రావాలని కేంద్ర మంత్రిని కోరారు టీజీ భరత్.
కేంద్ర మంత్రితో భేటీ అనంతరం ఢిల్లీలో ఎంపీ నాగరాజుతో కలిసి టీజీ భరత్ మీడియాతో మాట్లాడారు. తాను చేసిన సూచనల పట్ల సానుకూలంగా కేంద్ర మంత్రి స్పందించినట్లు చెప్పారు. గుత్తి పెట్రోల్ బంక్ సర్కిల్ నుండి పెద్దటేకూరు వరకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న హైవే లైటింగ్ గురించి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ప్రతిపాదన పరిశీలనలో ఉందని ఆయన తెలిపారన్నారు. ఇక కర్నూలు-బళ్లారి జాతీయ రహదారి ప్రతిపాదనతో సహా ముఖ్యమైన ప్రాంతీయ రహదారి అనుసంధాన అవసరాలను వివరించినట్లు చెప్పారు. ఇది ట్రాఫిక్ను సులభతరం చేయడానికి, వాణిజ్యాన్ని పెంచడానికి , మన ప్రజలకు అంతర్రాష్ట్ర అనుసంధానాన్ని మెరుగు పరచడానికి కీలకమైనదన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో, హైవే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, భద్రతను పెంచడానికి , ప్రతి పౌరుడికి సున్నితమైన అనుసంధానాన్ని నిర్ధారించడానికి కృషి చేస్తున్నామని టీజీ భరత్ అన్నారు. కేంద్ర మంత్రితో జరిగిన చర్చ ఎంతో సానుకూలంగా సాగిందన్నారు.
















