Sri Kodandarama Temple : తిరుపతి – తిరుపతి శ్రీ కోదండ రామ స్వామి వారి ఆలయ పవిత్రోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, సహస్ర నామార్చన నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహ వచనం, కుంభారాధన, ఉక్త హోమాలు నిర్వహించారు.
Sri Kodandarama Temple Updates
ఈ సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి (Sri Kodandarama Temple) వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో ఉత్సవ మూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం యాగశాలలో పవిత్ర మాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువ మూర్తులు, కౌతుక మూర్తులు, స్నపన మూర్తులకు బలిమూర్తులకు పవిత్రాలు సమర్పించారు. అదే విధంగా విష్వక్సేన, ద్వారపాలకులు, భాష్యకార్లు, గరుడాళ్వార్, యాగశాలలోని హోమ గుండాలు, బలిపీఠం ధ్వజస్తంభం, ఆలయం ఎదురుగా గల ఆంజనేయ స్వామి వారికి పవిత్రాలు సమర్పించారు.
సాయంత్రం శ్రీ సీతా రామలక్ష్మణులు బంగారు తిరుచ్చిపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆ తరువాత యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపడతారు . ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో రవి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
Also Read : Ashadam Shakambari Ustavams Interesting : కొత్తపేటలో ప్రత్యంగిరా పరమేశ్వరి అమ్మవారికి శాకాంబరీ ఉత్సవాలు



















