తిరుమల : తిరుపతిలో జరిగిన సదస్సులో పాల్గొన్న అనంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధ్యక్షుడు మోహన్ భగవత్ , కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తో కలిసి తిరుమల పుణ్య క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఆర్ఎస్ఎస్ బాస్ రాకతో భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. మరో వైపు తిరుమలకు వరుస సెలవులు రావడంతో భక్త బాంధవులు పోటెత్తారు. క్రిక్కిరిసి పోయింది పుణ్య క్షేత్రం. ఈ సందర్బంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ముఖ్య కార్య నిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరితో పాటు తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యులు కూడా పాల్గొన్నారు.
అంతకు ముందు తిరుమలకు ప్రతి నిత్యం సుమారు 70 వేల మందికి పైగా భక్తులు హాజరవుతున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఈ తరుణంలో లక్షలాది భక్తుల ఆకలిని తీరుస్తూ వస్తోంది తిరుమల లోని తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదానం సత్రం. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ బాస్ మోహన్ భగవత్, చైర్మన్ బీఆర్ నాయుడు, ఏఈవో వెంకయ్య చౌదరితో కలిసి వెంగమాంబ సత్రానికి స్వయంగా వెళ్లారు. అక్కడ భక్తులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ మహా ప్రసాదం అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించారు. స్వామి వారి సన్నిధిలో ఉండటం తాను మహత్ భాగ్యంగా భావిస్తున్నట్లు తెలిపారు. క్షేత్ర సాంప్రదాయం ప్రకారం భగవత్ జీ భూ వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం శుక్రవారం ఉదయం ప్రోటోకాల్ ప్రకారం భగవత్ జీ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తిరుపతి , తిరుమల విశేషాలను ఈవో ఆర్ఎస్ఎస్ చీఫ్ కు వెల్లడించారు.



















