హైదరాబాద్ : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై భగ్గుమన్నారు. మూసీ పేరుతో పేదల ఇండ్లను కూల్చుతామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి, యోగి ఆదిత్యానాథ్ నిర్ణయాలు తీసుకోవడంలో ఇద్దరూ ఒక్కటేనని ఆరోపణలు చేశారు అక్బరుద్దీన్ ఓవైసీ. ఇద్దరూ కావాలని పేదలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో బుల్డోజర్ల పాలన సాగుతోందని మండిపడ్డారు.
ఇకనైనా సీఎం రేవంత్ రెడ్డి తన పనితీరు మార్చుకోవాలని హితవు పలికారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు అక్బరుద్దీన్ ఓవైసీ. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మసీదులు కూల్చుతుంటే..ఇక్కడ రేవంత్ రెడ్డి ముస్లింల ఇండ్లు కూల్చాలని చూస్తున్నాడని ఆరోపించారు ఎంఐఎం ఎమ్మెల్యే. ముస్లింల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ ఒకటేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఇద్దరు సీఎంలు ఎవరికి వారి తోచిన రీతిలో ఇష్టానుసారం తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటే జనం తిరగబడే రోజు తప్పకుండా వస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
పేదలు, మధ్యతరగతి ప్రజలను ప్రజా పాలన పేరుతో ఇబ్బందులకు గురి చేయడం దారుణమన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని హితవు పలికారు. ముందు వెనుకా ఆలోచించి ప్రజలకు మేలు చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు ఎమ్మెల్యే. తాజాగా ఎంఐఎం ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
















