కర్ణాటక : కలబురిగిలో నీటి కొరత పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. దాదాపు ఎనిమిదేళ్లుగా తాగునీటి ప్రాజెక్టును చేపట్టినప్పటికీ, దాని ద్వారా ఆశించిన ఫలితాలను అందించడంలో ఎల్ అండ్ టి కంపెనీ విఫలమైందని ఆరోపించారు. కలబురిగి నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ఈ నిరసన జరిగింది. నగరంలో తీవ్రమవుతున్న తాగునీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నిరసన చేపట్టారు. అనేక సంవత్సరాలుగా ప్రాజెక్టును నిర్వహిస్తున్నప్పటికీ, నగరంలో దీర్ఘకాలంగా ఉన్న నీటి సరఫరా సమస్యలను పరిష్కరించడంలో ఎల్ అండ్ టి విఫలమైందని ఆరోపిస్తూ, ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ , పట్టణాభివృద్ధి శాఖ మంత్రి యతీంద్ర సిద్ధరామయ్యలకు అధికారుల ద్వారా వినతి పత్రం సమర్పించారు.
కరువు పరిస్థితుల కారణంగా భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోవడంతో కలబురిగిలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన తాగునీటి కొరత ఏర్పడిందని వారు పేర్కొన్నారు. కొన్ని వార్డుల్లో నివాసితులకు రెండు రోజులకోసారి మాత్రమే నీరు అందుతోందని, దీనివల్ల అనేక కుటుంబాలు కనీస గృహ అవసరాలకు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందారు. పశువుల యజమానులు తమ పశువులకు నీరు అందించడంలో ఇబ్బందులు పడుతుండగా, పరిమిత ఆదాయం ఉన్న అనేక పేద కుటుంబాలు ప్రైవేట్ ట్యాంకర్ల నుండి నీటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. అనేక ప్రాంతాల్లో మహిళలే ఈ సంక్షోభం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించిన వివిధ సంఘాలు, ప్రతి వార్డుకు సురక్షితమైన తాగునీటిని ఎటువంటి జాప్యం లేకుండా క్రమం తప్పకుండా సరఫరా చేసేలా చూడాలని కలబురిగి నగరపాలక సంస్థను కోరాయి.
పైప్లైన్ పనుల కోసం నగరం అంతటా రోడ్లను తవ్వినప్పటికీ, వాటిని సరిగ్గా పునరుద్ధరించక పోవడం వల్ల వాహనదారులు, పాదచారులు, వృద్ధులు , పాఠశాల విద్యార్థులకు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని వారు ఆరోపించారు. అలాగే, డ్రైనేజీ నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల మురుగునీరు పొంగి పొర్లుతోందని, అపరిశుభ్ర పరిస్థితుల కారణంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో కలరా వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల ముప్పు పెరిగిందని వారు పేర్కొన్నారు.















