ఘనంగా రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవం

భారీ ఎత్తున హాజ‌రైన భ‌క్త జ‌న బాంధ‌వులు

hellotelugu-SubbaammaThootaUtsavam

తిరుప‌తి : తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో కొలువైన శ్రీ సీతారాములు, లక్ష్మణస్వామి వారికి రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవం ఘనంగా జరిగింది. ఉదయం 9.30 గంటలకు శ్రీ కోదండ రామాలయం నుండి శ్రీ సీతారాముల సమేత లక్ష్మణస్వామి వారి ఉత్సవ మూర్తులను పాత ప్రసూతి ఆసుపత్రి రోడ్డులోని రేపాకుల సుబ్బమ్మ తోట (ఆర్‌ఎస్‌ గార్డెన్స్‌)కు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం, ఆస్థానం, నివేదన నిర్వహించారు.సాయంత్రం 5 గంటలకు స్వామివారి ఊరేగింపుగా రాత్రి 7 గంటలకు శ్రీ కోదండ రామాలయానికి చేరుకున్నారు.

శ్రీకోదండ రామస్వామికి రేపాకుల సుబ్బమ్మ అపర భక్తురాలు. ఈమె వందేళ్ల క్రితం స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించేవారు. 1910వ సంవత్సరం నుండి కోదండ రాముని బ్రహ్మోత్సవాల్లో కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహన సేవలను సొంత ఖర్చులతో నిర్వహించేవారు. తన తదనంతరం కూడా ఈ సేవలు కొనసాగాలనే తలంపుతో 1933వ సంవత్సరంలో కొంత స్థలాన్ని కోదండ రామాలయానికి విరాళంగా అందించారు. ఈ భూమిలోనే ప్రస్తుతం ఎస్వీ బాలమందిరం, ఆర్‌ఎస్‌ గార్డెన్స్‌ ఉన్నాయి. కోదండరాముని భక్తురాలైన రేపాకుల సుబ్బమ్మ కోరిక మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏటా ఈ ఉత్సవం నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమంలో ఆలయ‌ డెప్యూటీ ఈవో నాగ‌ర‌త్న‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు సురేష్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Exit mobile version