హైదరాబాద్ : హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. అమీన్ పూర్ లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఉదయం మొదలు పెట్టిన కార్యక్రమం రాత్రి వరకు కొనసాగింది. రాత్రి పూట ఆపేసి ఆదివారం ఉదయం మళ్ళీ హైడ్రా ప్రారంభించింది. Mukheem సోదరుడు అజీమ్ అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల భవనం 90 శాతం తొలగించడం అయ్యింది. పక్కనే ఉన్న అపార్టుమెంట్లకు ఎలాంటి నష్టం జరగకుండా హైడ్రా జాగ్రత్తలు తీసుకుంది. దీంతో అక్రమ భవనం కూల్చివేతకు సమయం పడుతోంది. అలాగే 861 ఎకరాల చుట్టు ఫెన్సింగ్ వర్క్ జరుగుతోంది. హైడ్రా అధికారులు దగ్గరుండి ఈ ఆక్రమణ తొలగింపు , ఫెన్సింగ్ నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్నారు.
స్థానికులు హైడ్రాకు సహకరించడమే కాదు అభినందిస్తున్నారు. గతంలో భయం భయంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు హైడ్రా రాకతో మాకు భరోసా వచ్చింది. మా ఇళ్ళను కూల్చమని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఖాళీ స్థలాలను కాపాడుతూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. మాలో ఉన్న ఆందోళనలన్నీ పటాపంచలు అయ్యాయి. ప్రభుత్వానికి ధన్యవాదాలు. హైడ్రా చర్యలు అభినందనీయం అని స్థానికులు చెబుతున్నారు. కబ్జాలు చేసి వందల ఎకరాలను మాయం చేసి వందలు, వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టిన గుండాల భరతం పట్టడంలో హైడ్రా చొరవని అభినందిస్తున్నాం అని పలువురు సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఆక్రమణలకు సంబంధించి మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఎవరు కబ్జాలకు పాల్పడినా చూస్తూ ఊరుకునేది లేదని పేర్కొన్నారు.
















