TTD Chairman : తిరుపతి – టిటిడి ఆధ్వర్యంలోని బర్డ్ ఆసుపత్రిలో సర్జరీల సమయాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు వైద్యులకు సూచించారు. తిరుపతి శ్రీ పద్మావతీ గెస్ట్ హౌస్ లోని సమావేశ మందిరంలో బర్డ్ ట్రస్ట్ నిర్వహణపై టిటిడి ఈవో జె. శ్యామల రావుతో కలిసి టిటిడి ఛైర్మెన్ సమీక్షించారు.
TTD Chairman Br Naidu Comments
ఈ సందర్భంగా టిటిడి ఛైర్మెన్ (TTD Chairman) మాట్లాడుతూ బర్డ్ ఆసుపత్రికి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, గత కొంత కాలంగా బర్డ్ ఆసుపత్రి నిర్వీర్యం అయిందని, తిరిగి పూర్వవైభవం తీసుకురావాలని కోరారు. బర్డ్ లో వైద్య సేవలకు గ్రామీణ ప్రాంతాల రైతులకు, నిరుపేదలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సర్జరీలకు వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు అవసరమైన మౌళిక సదుపాయాలు, వైద్యులు, సిబ్బంది, మందులు, పరికరాలను అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. మోకాలి మార్పిడి, తదితర శస్త్ర చికిత్సలకు ఉపయోగించే అవసరమైన విదేశీ పరికరాలను మరింత నాణ్యంగా ఉండే వాటిని ఎంపిక చేసుకుని భారతీయ ధరలకు అనుగుణంగా సేకరించాలని సూచించారు.
ఈ సందర్భంగా టిటిడి (TTD) ఈవో జె. శ్యామల రావు మాట్లాడుతూ, శ్రీ పద్మావతీ చిన్న పిల్లల హృదలాయంలో చిన్న పిల్లల హార్ట్ ఆపరేషన్లకు దాతలు విరాళం ఇచ్చే ఆపన్న హృదయ స్కీం ఉందని, అదే విధంగా బర్డ్ లో కూడా పేద వర్గాల వారికి సర్జరీలు చేసేందుకు దాతల నుండి విరాళం సేకరించే అంశంపై టిటిడి జేఈవో, ఎఫ్.ఏ అండ్ సీఏవో, బర్డ్ డైరెక్టర్ సంయుక్తంగా నివేదిక తయారు చేయాలని సూచించారు. బర్డ్ ఆసుపత్రిని అందరికి అందుబాటులో ఉండేలా తయారు చేయాలన్నారు. అవసరమైన అధునాతన పరికరాలను నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలన్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ డా. జి. జగదీశ్ మాట్లాడుతూ దివ్యాంగ పిల్లలకు సర్జరీలను తక్షణం చేస్తున్నామని, జాయింట్ రీప్లేస్మెంట్ లకు ఏడాది సమయం పడుతోందని వివరించారు. బర్డ్ ఆసుపత్రి ప్రారంభం నుండి నేటి వరకు చేపట్టిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు . ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు సదాశివరావు, టి. జానకి దేవి, వర్చువల్ ద్వారా డా. అదిత్ దేశాయ్, జేఈవో వి. వీరబ్రహ్మం, ఎప్ఏ అండ్ సీఏవో ఓ. బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
Also Read : Chinta Mohan Shocking Comments : టీటీడీలో అంటరానితనం బాధాకరం – చింతా మోహన్


















