RBI : ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆధ్వర్యంలో ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశాలు నేటి నుంచి మూడు రోజులపాటు జరగనున్నాయి. ఈ సమావేశాల అనంతరం ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధానాన్ని మల్హోత్రా (Sanjay Malhotra) బుధవారం ప్రకటించనున్నారు.
RBI – రెపోరేటుపై చర్చలు
ప్రస్తుతం 5.5 శాతం ఉన్న కీలక రెపోరేటును యథాతథంగా కొనసాగిస్తారా? లేక 0.25 శాతం తగ్గిస్తారా? అన్న అంశంపై ఆర్థిక నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్బీఐ రీసెర్చ్ ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం ప్రభుత్వం నిర్దేశించిన 4 శాతం లక్ష్యానికి దిగువన ఉండటం వల్ల రెపోరేటు 5.25 శాతానికి తగ్గే అవకాశం ఉంది. అదే అభిప్రాయాన్ని క్రిసిల్ ప్రధాన ఆర్థికవేత్త ధర్మకీర్తి జోషి కూడా పంచుకున్నారు.
యథాతథంగా ఉండే అవకాశమే ఎక్కువ
అయితే, మరో వర్గం నిపుణులు రెపోరేటు ఈసారి కూడా 5.5 శాతం వద్దే కొనసాగుతుందని భావిస్తున్నారు. కారణంగా అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ట్రంప్ సుంకాల ప్రభావంపై స్పష్టత లేకపోవడాన్ని వారు సూచిస్తున్నారు. “అక్టోబర్ 1న వెలువడే విధానంలో పెద్ద మార్పులు అవసరం లేదు” అని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన ఆర్థికవేత్త మదన్ సబ్నవిస్ వ్యాఖ్యానించారు.
అలాగే జీఎ్సటీ 2.0 అమలు, జీడీపీ వృద్ధి రేటు స్థిరంగా ఉండటం కూడా రెపోరేటును ప్రభావితం చేసే అంశాలని నిపుణులు పేర్కొన్నారు. ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ కూడా యథాతథ స్థితి కొనసాగించే అవకాశాలే ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read : Today Gold Price : నేడు కూడా స్థిరంగా నడుస్తున్న పసిడి ధరలు


















