న్యూఢిల్లీ : ఎట్టకేలకు కేంద్రం దిగి వచ్చింది. విద్యార్థుల నిరసనల దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్బంగా స్పందించారు ఎంపీ రాహుల్ గాంధీ. ఆయన తనను కలిసిన విద్యార్థి నేతలతో చాలా సేపు విద్యా రంగంలో తీసుకు రావాల్సిన సంస్కరణల గురించి చర్చించారు. భారత విద్యార్థుల గొంతుకను ఎవరూ అణచి వేయలేరని అన్నారు. అలా అనుకోవడం భ్రమ మాత్రమేనని పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థులతో కలిసి ’10 జన్పథ్’ వద్ద మీడియాతో మాట్లాడారు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. దేశ యువత భవిష్యత్తు విషయంలో ఎటువంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
అవినీతి, అసమర్థతకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై వెంటనే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు రాహుల్ గాంధీ. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలోని విద్యార్థులందరికీ క్షమాపణ చెప్పాలని కోరారు. నరేంద్ర మోదీ భారతదేశ గతం. గతం ఎప్పుడూ భవిష్యత్తుతో పోరాడలేదని పేర్కొన్నారు. దేశ యువత భవిష్యత్తు, న్యాయం , పారదర్శకత కోసం కాంగ్రెస్ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని ప్రకటించారు. అయితే విద్యార్థుల డిమాండ్ల విషయంలో ఎటువంటి రాజీ లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. భారత యువతకు న్యాయం, పారదర్శకత, వారి కలలను కాపాడే విద్యా వ్యవస్థ అవసరం అని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.
















