బెంగళూరు : కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన తమ రాష్ట్రానికి చెందిన ప్రహ్లాద్ జోషి పై మండిపడ్డారు. తనను మంత్రిగా తాను ఒప్పుకోలేనంటూ పేర్కొన్నారు. గురువారం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడారు. తను రేపిస్టు నిందితులను వెనకేసుకు వచ్చాడని ఆరోపించారు. జోషి నియామకంపై గర్వపడలేమని సిద్ధరామయ్య కామెంట్స్ చేశారు. ఇటువంటి భావజాలం కలిగిన వ్యక్తి చేతిలో దేశ విద్యా వ్యవస్థ ఏమవుతుందో అన్నదే ఇప్పుడు మా ఆందోళన అని పేర్కొన్నారు. ప్రహ్లాద్ జోషి నియామకం కన్నడిగులకు అవమానకరం అని పేర్కొన్నారు. ఆ పదవి నుండి జోషిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
కర్ణాటకకు చెందిన ఒక పార్లమెంటు సభ్యుడు దేశ విద్యాశాఖ మంత్రి కావడం పట్ల మనం గర్వపడాల్సింది. కానీ దానికి భిన్నంగా, మహిళపై అత్యాచారానికి పాల్పడి దోషులుగా తేలిన వారిని సమర్థించిన ఎంపీ ప్రహ్లాద్ జోషిని ప్రధాని నరేంద్ర మోదీ నియమించడం ద్వారా కన్నడిగులు తలదించుకునేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు సిద్దరామయ్య. ప్రహ్లాద్ జోషి, పదవి దిగిపోతున్న విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భావజాల పరంగా కవలల వంటివారని ఆయన ఆరోపించారు. వీరిద్దరూ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. మహిళలు, దళితులు, పేదలు, వెనుకబడిన వర్గాలు, ముస్లింలు, క్రైస్తవుల పట్ల ఆర్ఎస్ఎస్ దృక్పథాన్నే వీరూ కలిగి ఉన్నారని పేర్కొన్నారు.



















