చెన్నై : తమిళనాడుకు చెందిన ప్రముఖ చెస్ మాస్టర్ ప్రజ్ఞానంద తన కెరీర్ లో మరో టైటిల్ కైవసం చేసుకున్నాడు. ప్రజ్ఞానంద తన తొలి ‘గ్రాండ్ చెస్ టూర్’ టైటిల్ను గెలుపొందాడు. సెయింట్ లూయిస్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద రమేష్బాబు గ్రాండ్మాస్టర్ ఫాబియానో కరువానాపై అద్భుతమైన పునరాగమనం చేసి విజయం సాధించాడు. దీనితో పాటు 2,00,000 డాలర్ల ప్రథమ బహుమతిని కూడా గెలుచుకున్నాడు . ఈ విజయంతో ‘గ్రాండ్ చెస్ టూర్’ గెలిచిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. రోజు ప్రారంభంలో కరువానా కంటే ఆరు పాయింట్లు వెనుకబడి ఉన్నప్పటికీ ప్రజ్ఞానంద వేగంగా పుంజుకుని రెండు ‘రాపిడ్’ గేమ్స్లోనూ గెలిచి ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ‘బ్లిట్జ్’ విభాగంలో కరువానాతో స్కోరు సమం చేసుకుని, మొత్తం 15-13 స్కోరుతో టైటిల్ను ఖరారు చేసుకున్నాడు.
మొదటి బ్లిట్జ్ గేమ్లో ప్రజ్ఞానందకు గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ సమయం తక్కువగా ఉన్న ఒత్తిడిలో పొరపాటు చేశాడు. అతని పరిస్థితి క్షీణించినప్పటికీ కరువానా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు, దాంతో ఆ గేమ్ డ్రాగా ముగిసింది. మూడవ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో గ్రాండ్మాస్టర్ వెస్లీ సో కూడా అద్భుత పునరాగమనం చేశాడు. రాపిడ్ విభాగంలో ఇద్దరు ఆటగాళ్లు చెరో విజయం సాధించగా, బ్లిట్జ్ విభాగంలో సో ఆధిపత్యం ప్రదర్శించాడు; అతను నాలుగు గేమ్స్లోనూ గెలిచి, ఒక గేమ్ మిగిలి ఉండగానే మ్యాచ్ను తన ఖాతాలో వేసుకున్నాడు. 18-12 స్కోరుతో విజయం సాధించాడు. అంతకు ముందు రెండవ ‘క్లాసికల్’ గేమ్లో ప్రజ్ఞానంద డ్రా సాధించాడు, కానీ అప్పటికే అతని ప్రత్యర్థి కరువానా ఆరు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు. ఈ యువ భారత గ్రాండ్మాస్టర్ తన మొదటి క్లాసికల్ గేమ్లో కరువానా చేతిలో 6-0తో ఓడిపోయినప్పటికీ, రెండవ క్లాసికల్ గేమ్లో 3-3తో డ్రా సాధించ గలిగాడు.



















