హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్లాటినం జూబ్లీ ఉత్సవాలకు సిద్ధమవుతున్న సాలార్జంగ్ మ్యూజియం ఆధునీకరణ , విస్తరణకు మద్దతు ఇవ్వాలని సూచించారు. లోక్ భవన్లో వివిధ ప్రభుత్వ రంగ సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు గవర్నర్. ఈ సాలర్ జంగ్ మ్యూజియంకు ఆయన చైర్మన్ గా ఉన్నారు. జూన్ 14 నుండి 21 వరకు వారం రోజుల పాటు ప్లాటినం జూబ్లీ వేడుకల ప్రణాళికలపై చర్చించారు. ఈ సమావేశంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, జాయింట్ సెక్రటరీ శశికిరణ్ చారి పాల్గొన్నారు. నవాబ్ మీర్ యూసుఫ్ అలీ ఖాన్ (సాలార్జంగ్ III) జయంతి సందర్భంగా నిర్వహించనున్న ఈ వేడుకల్లో ప్రత్యేక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యాపరమైన కార్యక్రమాలు, ప్రచురణలు , ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలు ఉంటాయని శుక్లా తెలిపారు.
రాబోయే ఐదేళ్లలో మ్యూజియంను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక సంస్థగా తీర్చిదిద్దేందుకు సమగ్ర అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సహకరించాలని కోరారు . మూసీ నదీ తీర ప్రాంత అభివృద్ధి, సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కిషోర్ తెలిపారు. తెలంగాణ హైకోర్టు, సాలార్జంగ్ మ్యూజియం, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పరిసర ప్రాంతాలను ‘హెరిటేజ్ కారిడార్’ (వారసత్వ కారిడార్)గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

















