Pawan Kalyan : అమరావతి : రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనా పరమైన సంస్కరణలు తీసుకు వచ్చామని, వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందించే బాధ్యత ఉద్యోగులపై ఉందని రాష్ట్ర ఉప ముఖమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డివిజినల్ లెవల్ డెవలప్మెంట్ ఆఫీసర్ (డి.ఎల్.డి.ఓ.) కార్యాలయాలు ప్రారంభించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. క్లస్టర్ విధానం రద్దు చేసి 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లు చేయడం ద్వారా గ్రామీణులకు మెరుగైన సేవలు అందించే వెసులుబాటు తీసుకు వచ్చామని అన్నారు.
Deputy CM Pawan Kalyan Key Comments
పల్లెల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పంచాయతీలు, గ్రామీణాభివృద్ధికి నిధులు సమకూరుస్తున్నామని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులతోపాటు పంచాయతీలు ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించే విధంగా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. నిధులు సమకూర్చడంలోను, పాలనా పరమైన సంస్కరణల్లోనూ కూటమి ప్రభుత్వం ఎంతో సానుకూల దృక్పథంతో ఉందని ఈ సందర్భంగా నొక్కి చెప్పారు పవన్ కళ్యాణ్. ఆ ఫలితాలు ప్రజలకు చేర్చి పల్లెల అభివృద్ధిలో ఉద్యోగులు క్రియాశీలక బాధ్యత తీసుకోవాలన్నారు. నిధుల వినియోగం, పాలన సంస్కరణల అమలుపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షలు చేపట్టాలని దిశా నిర్దేశం చేశారు. పల్లె పండగ 2.0 ద్వారా గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి ప్రణాళిక అందించాలని ఆదేశించారు.
Also Read : Vangalapudi Anitha Clear Instructions : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అనిత
















