Pawan Kalyan : అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో యధేశ్చగా కొనసాగుతున్న పేకాట స్థావరాలు, శిబిరాల నిర్వహణపై తక్షణమే నివేదిక ఇవ్వాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ లో జూదం ఆడటం, జూద కేంద్రాలు నిర్వహించడం, ప్రోత్సహించడం నేరం అన్నారు. ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ లో వీటిని నిర్వహించినా, ఆడినా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ – 1974 ప్రకారం శిక్షార్హులు అవుతారు అని చట్టం చెబుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో చట్ట విరుద్ధంగా జూద కేంద్రాలు సాగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.
Deputy CM Pawan Kalyan Key Instructions
పేకాట క్లబ్బుల నిర్వహణ వల్ల లక్షలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని ఆ ఫిర్యాదుల్లో వాపోయారు. కొందరు పెద్దలు పేకాట కేంద్రాలను నిర్వహిస్తూ, నెలవారి మామూళ్లను అధికారులకు అంద జేస్తున్నారనే ఆరోపణలు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై నిజానిజాలు తెలుసుకునేందుకు, పోలీసు అధికారులకు దీనిపై ఉన్న సమాచారం తెలుసు కునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపై ఆరా తీశారు. ఒకవేళ పోలీసు అధికారుల దృష్టికి వచ్చిన వివరాలు, దానిపై తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో తెలియ జేయాలని పవన్ కళ్యాణ్ డీజీపీకి స్పష్టం చేశారు.
Also Read : CM Chandrababu Strong Warning : శాంతి భద్రతలకు విఘాతం కలగిస్తే చర్యలు


















