ఆగస్టు 23 నుండి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

ప్ర‌క‌టించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి

hellotelugu-TirumalaPavitrotsavam

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ్రీ‌వారి భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 23 నుంచి 25వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయని తెలిపింది. ఇందుకు సంబంధించి వివ‌రాలు వెల్ల‌డించింది. ఆగస్టు 22వ తేదిన అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయని తెలిపింది టీటీడీ. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వ‌హిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. ఆగస్టు 23న పవిత్రాల ప్రతిష్ట, 24న పవిత్ర సమర్పణ, 25న పూర్ణాహుతి కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తారు.

ఇదిలా ఉండ‌గా ప‌విత్రోత్స‌వాల్లో ఆగస్టు 22న అంకురార్ప‌ణ కార‌ణంగా సహస్ర దీపాలంకార సేవను టీటీడీ ర‌ద్దు చేసింది. అదేవిధంగా ఆగస్టు 23 నుండి 25వ తేది వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార, 25న అష్టదళ పాద పద్మారాధన సేవను, ఆగస్టు 26న (పవిత్రోత్సవాలు ముగిసిన తర్వాత రోజు) కల్యాణోత్సవ సేవలను రద్దు చేసిన‌ట్లు వెల్ల‌డించింది.

Exit mobile version