Pavitra Samarpana : హైదరాబాద్ : హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ (Jublee Hills) శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో రెండో రోజైన శనివారం పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర సమర్పణ చేశారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్ర నామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణ మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. ఇందులో భాగంగా పుణ్యాహ వచనం, పంచగన్యారాధన, రక్షా బంధనం, అన్న ప్రానాయానం నిర్వహించారు.
Pavitra Samarpana Interesting Update
ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఉత్సవ మూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆలయంలోని మూలవర్లకు, ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేశారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్లు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించనున్నారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సలహా మండలి అధ్యక్షులు వేంకటేశ్వర రెడ్డి, ఏఈవో రమేష్ , టెంపుల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ కుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Also Read : Mukesh Ambani Growth : రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ2 ఫలితాలు: నికర లాభం రూ.18,165 కోట్లు



















