Pattabhishekam : తిరుపతి – వాల్మీకిపురం శ్రీ పట్టాభి రామస్వామి వారి పట్టాభిషేక మహోత్సవాలు (Pattabhishekam) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా ప్రారంభమైంది. ముందుగా ఆలయ అర్చకులు పుణ్యాహ వచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, విశేషారాధన చేశారు. ఆ తరువాత రక్షాబంధన, అగ్నిప్రతిష్ఠ, మధుపర్కం, కన్యాదానం, మహాసంకల్పం, స్వామి, అమ్మవారికి ప్రవరలు, మాంగళ్యపూజ చేపట్టారు.
Pattabhishekam Mohotsavam in Tirupati
అనంతరం మాంగళ్య ధారణ, ఉక్త హోమాలు, పూర్ణాహుతి, నివేదన, అక్షతా రోహణం, ముత్యాల తలంబ్రాల సమర్పణ, విశేష నివేదన, మాల మార్పిడి, అక్షతారోహణ, హారతి, చతుర్వేద పారాయణం, యజమానికి వేద ఆశీర్వాదం, హారతి ఇచ్చారు. కల్యాణం అనంతరం స్వామి వారు హనుమంత వాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు.
గురువారం తెల్లవారజామున యాగశాల పూజ, 6.30 గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవ, రాత్రి 8 గంటలకు గరుడ వాహనంపై శ్రీపట్టాభిరాముడు విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. అనంతరం మహాపూర్ణాహుతి, కుంభోద్వాసన, కుంభప్రోక్షణం నిర్వహించనున్నారు.
గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి శ్రీరామ పట్టాభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వరలక్ష్మీ, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
















