అమరావతి : టీడీపీ తరపున రాజ్యసభ కోసం తమ నామినేషన్లను సోమవారం దాఖలు చేశారు ఆ పార్టీకి చెందిన సానా సతీష్ , చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ. ఇప్పటికే చర్చోప చర్చలు జరిపి చివరకు ముగ్గురిని ఖరారు చేశారు పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఏపీ రాష్ట్రం తరపున నాలుగు రాజ్యసభ సీట్లకు గాను మూడు స్థానాలను టీడీపీ ఖరారు చేయగా ఒక స్థానాన్ని కూటమి సర్కార్ లో కీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీకి చెందిన జనసేన కు కేటాయించారు. ఇదే కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ కు సీటు దారదత్తం చేశారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ తరపున తమ నామినేషన్లను దాఖలు చేశారు ముగ్గురు అభ్యర్థులు.
ఇదిలా ఉండగా పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఈ ముగ్గురూ అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకు ముందు వారు పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఎన్.టి. రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యావేత్త , భాష్యం విద్యాసంస్థల అధినేత అయిన భాష్యం రామకృష్ణ, పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కీలక మద్దతుదారుగా నిలిచారు. 2024 ఎన్నికలలో గుంటూరు లోక్సభ టికెట్ దక్కక పోయినప్పటికీ, ఆయన పార్టీ సంస్థాగత కార్యకలాపాలు, శిక్షణా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. ఇక కాకినాడకు చెందిన సనా సతీష్, గతంలో 2024లో లోక్సభ టికెట్ ఆశించారు.
డిసెంబర్ 2024లో మోపిదేవి వెంకట రమణారావు రాజీనామా తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం సుమారు ఏడాదిన్నర మాత్రమే ఉండటంతో, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ ఆయనను తిరిగి నామినేట్ చేయాలని నిర్ణయించింది. వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం వహించడానికి , యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి చింతకాయల విజయ్ ఎంపికయ్యారు. ఆయన తండ్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రముఖ పదవిలో ఉన్నప్పటికీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి విజయ్ అందించిన సేవలు ఆయన అభ్యర్థిత్వం ఖరారు కావడంలో కీలక పాత్ర పోషించాయి.

















