హైదరాబాద్ : బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టి. చిరంజీవులు కీలక వ్యాఖ్యలు చేశారు. కుల గణనపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వక్రీకరించడం దారుణమన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. మే 20న సుధాకర్ గుమ్మల అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టి వేసిందన్నారు. ఈ పిటిషన్లో జనగణనలో కుల గణన నిర్వహించ కూడదని కోరారన్నారు. అయితే, సుప్రీం కోర్టు ఈ సందర్భంగా ఒక కీలకమైన అంశాన్ని స్పష్టం చేసిందని తెలిపారు. జనగణనలో కుల గణన చేపట్టాలా వద్దా అన్నది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ శాసన పరమైన విధాన నిర్ణయాల పరిధిలోకి వచ్చే అంశమని పేర్కొందన్నారు. అంటే, ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానిదే అని స్పష్టత ఇచ్చిందన్నారు టి. చిరంజీవులు.
కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన వివరించే ప్రయత్నం చేశారు. కుల ఆధారిత జనగణన, దాని అనుబంధ అంశాలు ప్రధానంగా శాసన పరమైన విధాన నిర్ణయాల పరిధిలోకి వస్తాయి. అందువల్ల ప్రస్తుత రిట్ పిటిషన్ను విచారించాల్సిన అవసరం మాకు కనిపించడం లేదు. కాబట్టి ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నాము. పెండింగ్లో ఉన్న ఇతర దరఖాస్తులు కూడా ముగిసినట్లుగా పరిగణించ బడతాయని ధర్మాసనం పేర్కొందన్నారు చైర్మన్. అయితే, ప్రస్తుతం కొంతమంది ప్రచారం చేస్తున్నట్లుగా సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పనిసరిగా కుల గణన నిర్వహించాలని ఆదేశించ లేదన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు మా సర్వే వల్లే సుప్రీం కోర్టు ప్రభావితమై కేంద్రానికి కుల గణన చేయాలని సూచించింది అనే విధంగా ప్రచారం చేయడం వాస్తవాలకు విరుద్ధం అని పేర్కొన్నారు.
మొదటి నుంచీ బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వంటి సంస్థలు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కుల గణన జరపాలని నిరంతరం డిమాండ్ చేస్తూ వచ్చాయన్నారు. 2024 డిసెంబర్ 11న ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం ఆధ్వర్యంలో కుల గణన అవసరంపై జాతీయ సెమినార్ నిర్వహించడం జరిగిందన్నారు.
















