MP Gurumurthy : తిరుపతి : ఏపీకి మరో నవోదయ విద్యాలయం ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు వైసీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి (MP Gurumurthy). తిరుపతి పార్లమెంట్ పరిధిలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూఎంపీ కేంద్ర విద్యా శాఖ మంత్రికి లేఖ రాశారు. ఈ మేరకు కేంద్రం నుండి సానుకూలమైన స్పందన వచ్చింది. ఈ మేరకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి పంపిన లేఖలో ఎంపీ ప్రతిపాదనను గుర్తిస్తూ, నవోదయ విద్యాలయ సమితితో చర్చించి విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం ఒక జిల్లాలో ఇప్పటికే నవోదయ విద్యాలయ ఉన్నచోట కొత్తగా స్థాపించడం సాధ్యం కాదని మంత్రి పేర్కొన్నారు.
MP Gurumurthy Key Comments
అయితే 1986-87లోనే తిరుపతి పార్లమెంటు పరిదిలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నవోదయ విద్యాలయ స్థాపించారని పేర్కొన్నారు. ఇటీవల తిరుపతి జిల్లా ప్రత్యేకంగా ఏర్పడిన నేపథ్యంలో తాజా గణాంకాలను పరిశీలించి తిరుపతి జిల్లాలో కొత్తగా జవహర్ నవోదయ విద్యాలయ స్థాపనకు సాధ్యా సాధ్యాలను పరిశీలిస్తామని స్పష్టం చేశారు. కొత్త నవోదయ విద్యాలయాల ఏర్పాటు సమయంలో తిరుపతి జిల్లాని పరిగణలోకి తీసుకుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి కేంద్ర విద్యా శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి జిల్లాలో నవోదయ విద్యాలయ స్థాపనకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నవోదయ విద్యాలయ స్థాపన కోసం ఒత్తిడి పెంచాలని కోరారు.
Also Read : Cricketer Sri Charani Important Meet : ఏపీ సీఎంతో క్రికెటర్ శ్రీచరణి భేటీ

















