MP Arvind : బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని, ఆ పార్టీ నేతల్ని వెంటనే జైలులో వేయాలని బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేస్తూ, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఇక అవకాశమే లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఓడిపోవడం ఖాయమని ధర్మపురి (MP Arvind) జోస్యం చెప్పారు. “వచ్చే ఎన్నికల్లో హరీష్ రావు తప్ప ఎవ్వరూ గెలవలేరు,” అని స్పష్టం చేశారు.
MP Arvind Slams
ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ధర్మపురి విమర్శలు గుప్పించారు. “ఉదయం బెదిరింపులు, సాయంత్రం మిలాఖత్ చేస్తే కాంగ్రెస్కు భవిష్యత్తే ఉండదు,” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
సోమవారం నిజామాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ నెల 29న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు. అమిత్ షా పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారని చెప్పారు. “నిజామాబాద్ వేదికగా పసుపు బోర్డు ప్రారంభం రైతులకు కొత్త శకాన్ని తీసుకొస్తుంది,” అని పేర్కొన్నారు.
అదే రోజు, దివంగత నేత డి. శ్రీనివాస్ విగ్రహావిష్కరణ చేస్తామని, అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో “రైతు సమ్మేళనం” నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో రైతులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేపట్టామని చెప్పారు.
మొత్తంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.
Also Read : Iran vs Israel Attack : ఐక్యరాజ్యసమితిలో అమెరికాను హెచ్చరించిన ఇరాన్
















