MLC Kavitha : హైదరాబాద్ – తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. తను హరీశ్ రావు, సంతోష్ రావులను లక్ష్యంగా చేసుకున్నారు. పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. హరీశ్, సంతోష్ లు తమ ఇళ్లను బంగారుమయం చేసుకుంటే అది బంగారు తెలంగాణా అవుతుందా అని ప్రశ్నించారు. పార్టీలో అంతర్గత కుట్రలు జరుగుతున్నాయని, రేవంత్ రెడ్డి, హరీశ్ రావు ఒకే విమానంలో ప్రయాణించిన తర్వాతే తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్ర ప్రారంభమైందని అన్నారు. వారి మధ్య రహస్య ఒప్పందం ఉందని, బీఆర్ఎస్ను హస్తగతం చేసుకోవడమే వారి లక్ష్యమని ఆరోపించారు. హరీశ్ రావును ట్రబుల్ షూటర్ కాదు ట్రబుల్ క్రియేటర్ అని కవిత (MLC Kavitha) తీవ్రంగా విమర్శించారు. అనేక మంది సీనియర్ నాయకులు జగ్గారెడ్డి, రఘునందన్ రావు, విజయశాంతి, ఈటెల రాజేందర్ వంటి వారు హరీశ్ రావు వల్లే పార్టీకి దూరమయ్యారని ఆరోపించారు. దుబ్బాక ఓటమికి కూడా హరీశ్ రావే కారణమని పేర్కొన్నారు.
MLC Kavitha Shocking Comments on Harish Rao
బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పతాక స్థాయికి చేరాయి. కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీలో జరుగుతున్న అంతర్గత కుట్రలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రధానంగా హరీశ్ రావు, సంతోష్ రావులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని, ప్రజా సమస్యలపై మాట్లాడితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలుగా చిత్రీకరించారని కవిత ఆరోపించారు. పార్టీ పెద్దలు ఈ విషయాలపై పునరాలోచించాలని కోరారు. తాను బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్పై ఒత్తిడి తెచ్చానని, సామాజిక తెలంగాణా అనడంలో తప్పేముందని కవిత ప్రశ్నించారు. ఈ నినాదం కేసీఆర్ నుంచే తాను నేర్చుకున్నానన్నారు. పార్టీలో జరుగుతున్న కుట్రల గురించి తాను కేటీఆర్ కు చెప్పినా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదని, కేసీఆర్ బిడ్డకే అన్యాయం జరిగితే మిగతా వారికి ఏం న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు.
హరీశ్ రావు, సంతోష్ రావులు మీరు అనుకున్నట్లు మంచి వారు కాదని, వారు ఎప్పటికైనా మిమ్మల్ని బయటకు గెంటి వేసే రోజు తప్పకుండా వస్తుందన్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్, కేటీఆర్ లకు హితవు పలికారు.
Also Read : Special Trains Exclusive : ఆ రూట్ లో ప్రత్యేక రైళ్లను నడపనున్న సౌత్ సెంట్రల్ రైల్వే
















