MLC Kavitha : హైదరాబాద్ – ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకోవడానికి హరీష్ రావు పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈరోజు నాకు జరిగింది రేపు కేసీఆర్, కేటీఆర్ కు కూడా జరగొచ్చన్నారు. మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి నాన్న అంటూ కేసీఆర్ కు హితవు పలికారు. కేసీఆర్, కేటీఆర్, నేను కలిసి ఉండకూడదని హరీష్ రావు కుట్రలు పన్నాడంటూ వాపోయారు. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. సీఎం రేవంత్ కు హరీశ్ సరెండర్ అయ్యాడంటూ బాంబు పేల్చారు.
MLC Kavitha Slams Harish Rao
బుధవారం కల్వకుంట్ల కవిత (MLC Kavitha) మీడియాతో మాట్లాడారు. భవిష్యత్ కార్యాచరణపై ఇంకా ఆలోచించ లేదని స్పష్టం చేశారు. సస్పెండ్ నోటీసు రావడంతో బాధపడ్డానని అన్నారు. నా లేఖ లీక్ చేసిన వ్యక్తులపై ఎందుకు విచారణ జరగ లేదని ప్రశ్నించారు. వివరణ తీసుకోకుండా డైరెక్ట్ గా ఉరి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ నేను ఫిర్యాదు చేసిన వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నాకు తెలియాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. పార్టీలో అంతర్గత స్వేచ్ఛ లేకపోతే ఎలా అని నిలదీశారు. తాను లేవదీసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్, కేటీఆర్, నాది రక్త సంబంధం అని, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే పోయే బంధం కాదన్నారు.
హరీష్ రావు కట్టప్పలాంటోడంటూ సంచలన ఆరోపణలు చేశారు కవిత. కేసీఆర్, కేటీఆర్ ను ఓడించేందుకు కుట్ర చేశాడని మండిపడ్డారు. కాళేశ్వరం నుంచి వచ్చిన అవినీతి డబ్బును ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలకు ఇచ్చాడని ఫైర్ అయ్యారు. ఎన్నికల ఫలితాలు అటు ఇటు అయితే కొంతమంది ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకునే ప్లాన్ వేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు కల్వకుంట్ల కవిత. తాను ఏ పార్టీలోనూ చేరనన్నారు. హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఒకే విమానంలో ప్రయాణం చేసినప్పుడే నా మీద, మా కుటుంబం మీద కుట్ర మొదలైందన్నారు. రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకుని హరీష్ రావు బ్రతిమిలాడిన తర్వాతే ఇంత పెద్ద కుట్ర చేశారని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్పై ఆరోపణలు చేస్తున్న రేవంత్.. హరీష్పై ఎందుకు చేయడం లేదన్నారు.
Also Read : AP BJP Chief Madhav – Farming Growth : వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్రం పెద్దపీట
















