MLC Dasoju Sravan : హైదరాబాద్ – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ (MLC Dasoju Sravan) సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కొందరు ఉన్నతాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక కొందరు అధికారులు రూల్స్ కు విరుద్దంగా పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సివిల్ సెర్వెంట్లకు సంబంధించిన విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాజ్యాంగం ప్రకారం సివిల్ సర్వెంట్లకు బైబిల్ అయినా భగవద్గీత అయినా భారత రాజ్యాంగమేనని స్పష్టం చేశారు. దురదృష్టశావత్తు కొందరు ఐఏఎస్, ఐపీఎస్లు సర్వీస్ రూల్స్ను అతిక్రమిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) బానిసల్లాగా పని చేస్తున్నారని ధ్వజమెత్తారు.
MLC Dasoju Sravan Key Comments
ఖైరతాబాద్ నియోజకర్గంలో రేషన్ కార్డుల పంపిణీలో ఐపీఎస్ దేవేంద్ర సింగ్ చౌహన్, ఐఏఎస్ హరిచందన కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నట్టు మాట్లాడారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని అందరి ముందే ఉల్లంఘించారని ఆరోపించారు. సీనియర్ ఐఏఎస్, సీనియర్ ఐపీఎస్ అధికారులు అయ్యుండి వారిద్దదు బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదజల్లేలా మాట్లాడటం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని వారు అబద్ధాలు చెప్పారన్నారు. రాజ్యాంగం ప్రకారం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సివిల్ సర్వెంట్లు పచ్చి అబద్ధాలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
పన్నెండేళ్ల క్రితం తాను సబ్ కలెక్టర్గా ఉన్నపుడు రేషన్ కార్డులు ఇవ్వడం చూశాను మళ్ళీ ఇపుడే చూస్తున్నాను అని హైదరాబాద్ కలెక్టర్గా ఉన్న దాసరి హరిచందన చెప్పడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్గా ఉన్న దేవేంద్ర చౌహన్ కూడా పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని అబద్ధం చెప్పారన్నారు. సీఎంను, మంత్రులను ప్రసన్నం చేసుకునేందుకు వారు తాపత్రయ పడటం రాజ్యాంగాన్ని అవమానించడమేనని అన్నారు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్. కేసీఆర్ హయాంలో 6 లక్షల 47 వేల రేషన్ కార్డులు ఇచ్చారన్నారు. ఇదంతా ప్రభుత్వం వద్ద రికార్డులు ఉన్నాయన్నారు.
Also Read : KTR Fired on CM Revanth Reddy : సీఎం ఢిల్లీ టూర్ వల్ల తెలంగాణకు ఒరిగిందేంటి..?















