Ram Mohan Naidu : అహ్మదాబాద్లో ఈనెల 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన యవత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో మొత్తం 241 మంది ప్రాణాలు కోల్పోగా.. ఒక్కరు మాత్రం మృత్యుంజయుడిగా నిలిచాడు. తాజాగా ఈ విమాన ప్రమాదంపై కేంద్ర పౌరవిమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. విమాన ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. గడిచిన రెండు రోజులు భారంగా గడిచిందని.. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం అనుభవించే బాధ తనకు ప్రత్యేకంగా తెలుసన్నారు.
Union Minister Ram Mohan Naidu Key Comments
‘నాకు బాధితుల బాధ తెలుసు. నా తండ్రి గతంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. విమాన ప్రమాదం జరిగిన వెంటనే నేను సంఘటనా స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టాం. ప్రమాదం స్థలాన్ని పరిశీలించాను. గుజరాత్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. వీలైనంత సహాయక చర్యలు గుజరాత్ ప్రభుత్వం వెంటనే చేపట్టింది’ అని తెలిపారు. పౌర విమానయానా శాఖ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుందన్నారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మెడికల్, ఫోరెన్సిక్, టీమ్లతో పాటు ఐదుగురితో ఏఐబీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. బ్లాక్ బాక్స్ను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామని… అందులో ఉన్న సమాచారం కీలకంగా మారనుందని తెలిపారు. బ్లాక్ బాక్స్లో ఉన్న సమాచారం రానున్న రోజుల్లో కీలకమని చెప్పుకొచ్చారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి చైర్మన్ నేతృత్వంలో కమిటీ వేసినట్లు తెలిపారు. హోంశాఖ కార్యదర్శి, సివిల్ ఏవియేషన్ సెక్రటరీ, గుజరాత్ అధికారులు, పోలీసు కమిషనర్ అహ్మదాబాద్ (Ahmedabad), స్పెషల్ డైరెక్టర్ ఐబీని ఈ కమిటీలో నియమించినట్లు చెప్పారు.
మూడు నెలల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇస్తారన్నారు. భద్రతా ప్రమాణాలు పెంచేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రమాదం తెలిసిన వెంటనే బోయింగ్ 787 సిరీస్కు చెందిన విమానాలను పరిశీలించాల్సిందిగా డీజీసీఏకు ఉత్తర్వులు ఇచ్చామన్నారు. బోయింగ్ విమానాలు దేశంలో 34 ఉన్నాయని.. ఇప్పటికే 8 విమానాలను ఇన్స్పెక్షన్ చేసినట్లు చెప్పారు. డీఎన్ఏ టెస్టులు కూడా జరుగుతున్నాయన్నారు. 24 గంటల్లోనే ప్రధాని మోదీ ప్రమాద స్థలాన్ని పరిశీలించారన్నారు. హై లెవెల్ కమిటీతో సోమవారం (జూన్ 16) భేటీ అవనున్నట్లు తెలిపారు. గడిచిన 48 గంటల నుంచి ప్రజలకు అన్ని విషయాలు తెలియజేస్తున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
Also Read : Actress Kalpika Case Shocking : సినీ నటి కల్పిక పై మరో కొత్త కేసు పెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు


















