Ponnam Prabhakar : కరీంనగర్ జిల్లా : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్బంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కోహెడ మండలం బస్వాపూర్ పోరెడ్డిపల్లి లో వరద ఉధృతికి తెగిపోయిన రోడ్లను పరిశీలించారు.. కొట్టుకు పోయిన కల్వర్టులను చూశారు. బస్వాపూర్ అక్కెనపల్లి మధ్య వెళ్ళే బ్రిడ్జి వద్ద మోయ తుమ్మెద వాగు పరిశీలించారు పొన్నం ప్రభాకర్. రోడ్లపై ఆరబోసిన వడ్లు వరద కు మొత్తం కొట్టుకుపోయిన ప్రాంతాలను, వరదలతో ముంపులోనే ఉన్న దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించి, ఆవేదన చెందుతున్న రైతులతో మాట్లాడారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు మంత్రి.
Minister Ponnam Prabhakar Key Comments on Farmers
దెబ్బతిన్న రోడ్లను, కల్వర్టులను , దెబ్బతిన్న పంటలను అధికారులు మొత్తం రికార్డు చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా మొంథా తుపాను దెబ్బకు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. ఊహించని రీతిలో చేతికి వచ్చిన పంటలు నీటి పాలయ్యాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ముందస్తు హెచ్చరికల కారణంగా చాలా వరకు ప్రాణ, ఆస్తి నష్టం కాకుండా కాపాడడం జరిగిందని చెప్పారు ఈ సందర్బంగా పొన్నం ప్రభాకర్ గౌడ్. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా, నష్ట పరిహారం ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. త్వరలోనే అంచనా వేసి కేంద్రానికి నివేదికను పంపిస్తామని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తుందని హామీ ఇచ్చారు.
Also Read : DY CM Pawan Kalyan Important Visit : సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో పవన్ కళ్యాణ్

















