Minister Atchannaidu : అమరావతి – గత ప్రభుత్వ హయాంలో రైతులకు రూపాయికే బీమా అమలు చేస్తామని చెప్పి 3 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించకుండా జగన్ రెడ్డి మోసం చేశాడని మండిపడ్డారు మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). ప్రభుత్వంలో పేరుకు బీమా ఉన్నట్లు చెప్పినా రైతులకు వాస్తవంలో నామ మాత్రపు బీమాగా మిగిలి పోయిందన్నారు. అసెంబ్లీలో బీమా చెల్లించామని అబద్ధాలు చెప్పడమే కాక.. నిజంగా అప్పటికి జీవో కూడా లేకుండా మోసం చేశాడని ఆరోపించారు. పులివెందుల రిజర్వాయర్ నీటిని రైతులకు కాకుండా తన బంధువుల కంపెనీలకు మళ్లించాడని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో వ్యవసాయానికి ప్రాధాన్యత కన్నా.. గంజాయి పండించడానికి ఎక్కువ ఉత్సాహం చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Minister Atchannaidu Slams YS Jagan
రూ.3,138 కోట్ల బీమా క్లెయిమ్లు పెండింగ్గా ఉండటానికి కారణం రాష్ట్రం ప్రీమియం కట్టక పోవడమేనని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచిత బీమా పథకం మళ్లీ మొదలు పెట్టడమే కాక, అన్నదాత సుఖీభవ పథకం కింద ఆగస్టు 2వ తేదిన రైతుల ఖాతాల్లో రూ.3,156 కోట్లు జమ చేశామన్నారు. తానేదో రైతు ఉద్దారకుడిని అని చెప్పుకునే జగన్ రెడ్డి గత ఐదేళ్ల పాలనలో రైతులకు చెల్లించాల్సిన బీమాను మూడేళ్లపాటు నయా పైసా చెల్లించ లేదన్నారు. ఈ విషయం పార్లమెంటు సాక్షిగా వెల్లడైందన్నారు. ఏపీలో జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మూడేళ్లపాటు రైతులకు కేంద్రం ఇచ్చే ఫసల్ బీమా యోజన సొమ్ము ఇవ్వక పోవడంతో రైతులు ఇబ్బందుల పాలయ్యారని వాపోయారు. అంతేకాక రాష్ట్ర వాటాగా ఇచ్చినా ఇవ్వక పోయినా కేంద్ర ప్రభుత్వం తన వాటాను జమ చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వడంలో ఆలస్యం చేస్తే, దానిపై 12 శాతం వడ్డీ వసూలు చేసి రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉంటుందన్నారు.. కాని ఒక్క పైసా కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం జమ చేయలేదన్నారు.
Also Read : CM Chandrababu Invites Huge Industries : పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సురక్షితం – సీఎం
















