Atchannaidu : గుంటూరు – మార్క్ పెడ్ ద్వారా చేపట్టిన పొగాకు కొనుగోళ్ల వేగాన్ని మరింత పెంచే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) ఆదేశించారు. గుంటూరు రూరల్ ప్రాంతంలోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంలో పొగాకు సాగుచేసే ప్రాంతాలైన ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్ లు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, పర్చూరు ఎమ్మెల్యే ఎలూరి సాంబశివరావు, వ్యవసాయ, మార్క్ ఫెడ్ ఉన్నతాధికారులతో పొగాకు కోనుగోళ్లపై అచ్చెన్నాయుడు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
Minister Atchannaidu Comments
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్న (Atchannaidu) మాట్లాడుతూ రాష్ట్రంలో 2024-25 సంవత్సరంలో నల్లబర్లీ పొగాకు 80 మిలియన్ కిలోల ఉత్పత్తి జరిగిందన్నారు. 22 పొగాకు కంపెనీలు 36.00 మిలియన్ కిలోల పంటను కొనుగోలు చేశాయని వెల్లడించారు. ఈ నెల 21 నుండి సన్న, చిన్నరైతులను దృష్టిలో పెట్టుకొని కొనుగోలు యాప్ లో నమోదు కాబడని పొగాకు రైతులందరికి లబ్ధి చేకూరేలా మార్క్ ఫెడ్ అధికారులు, సిబ్బంది కొనుగోళ్ల ప్రక్రియను కొనసాగించాలని స్పష్టం చేశారు. ప్రతి రైతు దగ్గర కేజీ పొగాకు కూడా మిగలడానికి వీళ్లేదని, జూలై నెలలో కనిష్టంగా 1 కేజీ నుంచి గరిష్ఠంగా 20 క్వింటాల పొగాకు వరకు ఉన్న రైతుల వద్ద అర్జెంట్ గా పొగాకును కొనుగోళు చేయాలని ఆదేశించారు.
చిన్న రైతులకు తోడ్పాటును ఇవ్వటంతో పాటు పెద్ద రైతుల వద్ద కూడా త్వరిగతగిన పొగాకు కొనుగోళ్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కొనుగోళ్ల కేంద్రాలను పెంచాలని, గోడౌన్స్ సరిపోకపోతే ప్రైవేట్ గోడౌన్స్ ను అద్దెకు తీసుకోవాలని అన్నారు. కోనుగోలు కేంద్రాల వద్ద నుండి గోడౌన్స్ కు పొగాకును తరలించేందుకు రవాణా ఖర్చుల వలన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని కలెక్టర్లు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే మంత్రి స్పందిస్తూ కేంద్రాల నుండి గోడౌన్స్ వరకు అయ్యే రవాణా ఖర్చు వలన రైతులు ఇబ్బందులకు గురి అవ్వకూడదని, ఆ ఖర్చును కూడా మార్క్ ఫెడ్ భరిస్తుందని కలెక్టర్లకు హమీ ఇచ్చారు.
కొనుగోలు యాప్ లో నమోదైన రైతుల వద్దనే కాకుండా నమోదు కానీ రైతుల వద్ద కూడా పొగాకును కొనాలని అధికారులకు తెలిపారు. రైతులకు సమాచారం చేరవేసే పనిలో అధికారులు ఉండాలని, ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు జరగాలని, వచ్చే సోమవారం నుండి నూతన ప్రణాళిక ప్రకారం కొనుగోళ్లు యధావిధిగా జరగాలని మంత్రి అచ్చెన్న స్పష్టం చేశారు. రానున్న సీజన్ లో రైతులు పొగాకుకు ప్రత్యామ్నాయంగా వేరే పంటలను వేయాలని అందుకు వ్యవసాయ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Also Read : CM Chandrababu Interesting Awards : రాష్ట్రంలో ఇక ‘స్వచ్ఛత’ అవార్డులు – చంద్రబాబు
















