Ashwini Vaishnaw : కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వదేశీ సాఫ్ట్వేర్ జోహోకు (Zoho) మద్దతు తెలుపుతూ తన డిజిటల్ వినియోగాన్ని దానిపైకి మార్చుకుంటున్నట్లు ప్రకటించారు. డాక్యుమెంట్లు, స్ప్రెడ్షీట్లు, ప్రెజెంటేషన్ల కోసం ఇకపై జోహో సాధనాలను ఉపయోగిస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తాజాగా విడుదల చేసిన వీడియోలో తన నిర్ణయాన్ని వివరించారు.
సెప్టెంబర్ 24న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయాలను వైష్ణవ్ (Ashwini Vaishnaw) జోహో షో వేదికపై ప్రజలకు తెలియజేశారు. స్వదేశీ ఉత్పత్తుల వినియోగంపై ప్రధాని చేసిన పిలుపునకు అనుగుణంగా తాను ఈ అడుగు వేసినట్లు చెప్పారు. ఇకపై క్రమంగా స్వదేశీ వెబ్ బ్రౌజర్, జోహో అనువర్తనాలను మాత్రమే ఉపయోగిస్తానని స్పష్టం చేశారు.
Ashwini Vaishnaw – జోహో కంపెనీ పరిచయం
చెన్నై కేంద్రంగా ఉన్న జోహో కార్పొరేషన్ ఒక భారతీయ సాఫ్ట్వేర్ డెవలపర్ సంస్థ. పూర్తిగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ సంస్థ క్లౌడ్ ఆధారిత వ్యాపార సాధనాలు, ఉత్పాదకత అనువర్తనాలను అందిస్తుంది. 100 మిలియన్లకు పైగా వినియోగదారులు జోహో సర్వీసులను ఉపయోగిస్తున్నారు.
జోహో ప్రధాన సేవలు
- జోహో CRM – కస్టమర్ డేటా, అమ్మకాల నిర్వహణ
- జోహో మెయిల్ – సురక్షితమైన, ప్రకటనలులేని ఇమెయిల్ సేవ
- జోహో బుక్స్ – అకౌంటింగ్, బిల్లింగ్
- జోహో మీటింగ్ – ఆన్లైన్ సమావేశాల కోసం ప్లాట్ఫామ్
- జోహో ప్రాజెక్ట్స్ – ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్
చిన్న, పెద్ద వ్యాపారాలు సులభంగా ఉపయోగించగలిగేలా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఒకే ప్లాట్ఫామ్లో విస్తృత శ్రేణి సాధనాలను తక్కువ ఖర్చుతో అందించడం జోహో ప్రత్యేకత.
జోహో వినియోగ విధానం
వినియోగదారులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఖాతా సృష్టించి, తమ అవసరాలకు అనుగుణంగా జోహో మెయిల్, CRM, బుక్స్ వంటి టూల్స్ని ఎంచుకోవచ్చు. కొత్తవారికి ఉచిత ప్లాన్ అందుబాటులో ఉండగా, ఆపై అధునాతన ఫీచర్ల కోసం చెల్లింపు ప్యాకేజీలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం అమెజాన్, టాటా ప్లే, జొమాటో వంటి ప్రముఖ సంస్థలు జోహో సేవలను వినియోగిస్తున్నాయి.
Also Read : Today Gold Price : నేడు స్వల్ప తగ్గుదలతో నడుస్తున్న పసిడి ధరలు


















