నల్లగొండ జిల్లా : రాష్ట్రంలో ఎలినేనో ప్రభావం కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వరుణ యాగం చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఆయన ఉమ్మడి నల్లగొండ జిల్లాను ఎంచుకున్నారు. నాగార్జున సాగర్ లో ఈ యాగాన్ని చేపట్టనున్నారు. దీంతో సీఎం యాగం కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాగ కార్యక్రమం యాదగిరిగుట్ట ఆలయ అధికారుల పర్యవేక్షణలో 108 మంది రుత్వికులు, వేద పండితులు 11 హోమ గుండాల ద్వారా ఈ యాగాన్ని నిర్వహిస్తారు. ఆగస్టు 10న జరగనున్న వరుణ యాగం కోసం నాగార్జునసాగర్లోని వేదికను నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పరిశీలించారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ నాగార్జునసాగర్లో నిర్వహించనున్న వరుణ యాగం కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఆ రోజు మధ్యాహ్నం 3:45 గంటలకు జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.
నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు ఈ యాగానికి సంబంధించి. ముఖ్యమంత్రి సూచన మేరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అర్చకులు ,వేద పండితులు వరుణ యాగం కోసం ఆగస్టు 10ని శుభ ముహూర్తంగా నిర్ణయించారు. యాదగిరిగుట్ట ఆలయ అధికారుల పర్యవేక్షణలో 108 మంది రుత్వికులు , వేద పండితులు హోమ గుండాల ద్వారా ఈ యాగాన్ని నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్ రెవెన్యూ, దేవాదాయ, పోలీస్ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. మంత్రులు, ఎంపీలు , ఎమ్మెల్యేలు హాజరుకానున్న ఈ కార్యక్రమానికి ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు వీలుగా యాగస్థలం, ప్రవచన శాల , వేదిక చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. విజయ విహార్ వద్ద పారిశుధ్యం , పరిశుభ్రత బాధ్యతలను నందికొండ మున్సిపల్ కమిషనర్ కె. కోటేశ్వరరావుకు అప్పగించారు.
