Toll Tax : పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లు మరియు ఈ-బస్సులకు టోల్ టాక్స్ మినహాయింపు ప్రకటించింది. ఈ పథకం 2025, ఆగస్టు 22వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా కమిషనర్ వివేక్ భీమన్వర్ అధికారికంగా ప్రకటించారు.
Toll Tax – అటల్ సేతు, పూణే ఎక్స్ప్రెస్వే సహా ప్రధాన రహదారుల్లో మినహాయింపు
ఈ టోల్ (Toll Tax) మినహాయింపు పథకం అటల్ సేతు, పూణే ఎక్స్ప్రెస్వే, సమృద్ధి మహామార్గ్ వంటి ముఖ్యమైన హైవేల్లో అమలులోకి వస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్లో ప్రకటించిన ఎలక్ట్రిక్ వాహనాల విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రైవేట్, ప్రభుత్వ వాహనాలకు వర్తింపు – కమర్షియల్ వాహనాలకు మినహాయింపు లేదు
ఈ మినహాయింపు ప్రైవేట్ ఎలక్ట్రిక్ కార్లు, ప్రభుత్వ రంగానికి చెందిన వాహనాలు, మహారాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులు, మరియు పట్టణ ప్రజా రవాణా ఈ-బస్సులకు వర్తిస్తుంది. అయితే, సరుకుల రవాణా కోసం ఉపయోగించే ఎలక్ట్రిక్ ట్రక్కులు వంటి వాణిజ్య వాహనాలకు ఇది వర్తించదు.
Toll Tax – ముంబైలో ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి
ముంబై నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం నగరంలో సుమారు 25,277 ఈ-బైక్లు, 13,000కు పైగా ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 43,000 దాటినట్టు అధికారులు పేర్కొంటున్నారు.
చార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణ
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం హైవేలు, ఎక్స్ప్రెస్వేలలో ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. పెట్రోల్ పంపులతో పాటు ఎస్టీ స్టాండ్లు, బస్సు డిపోలలో కూడా నాలుగు నుండి ఐదు ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని రవాణా శాఖ భావిస్తోంది.
భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల లక్ష్యాలు
మహారాష్ట్ర కొత్త ఈవీ విధానం ప్రకారం, రాబోయే సంవత్సరాల్లో కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాల్లో కనీసం 30 శాతం ఎలక్ట్రిక్ వాహనాలుగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు ఇది 40 శాతం, కార్లు మరియు SUVలకు 30 శాతం, క్యాబ్ అగ్రిగేటర్లకు 50 శాతం, ప్రైవేట్ బస్సులకు 15 శాతం గా లక్ష్యాలను నిర్ధారించారు.
Also Read : Employment Growth : 2వ కోర్టర్ లో భారీగా కొలువుల జాతర



















