తిరుపతి : కార్వేటినగరం శ్రీ రుక్మిణి–సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి వైభవాలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో నాలుగో రోజైన మంగళవారం స్వామి వారు కాళీయమర్దనుడి అలంకారంలో కల్పవృక్ష వాహనంపై విచ్చేసి భక్తులకు దివ్య మంగళ దర్శనమిచ్చారు. గ్రామ వీధుల్లో స్వామివారి వాహనసేవ అత్యంత వైభవోపేతంగా సాగింది. వాహనం ముందుగా భక్త బృందాలు చెక్క భజనలు, కోలాటాలు నిర్వహిస్తూ గోవింద నామ స్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి.
మంగళ వాయిద్యాల నినాదాల మధ్య స్వామివారి ఊరేగింపు కనుల పండువగా సాగగా, భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి భక్తి శ్రద్ధలతో సేవలో పాల్గొన్నారు. పురాణాలలో కల్పవృక్షం కోరిన వరాలన్నింటినీ ప్రసాదించే దివ్య వృక్షంగా వర్ణించబడింది. అటువంటి కల్పవృక్ష వాహనంపై కాళీయమర్దనుడి రూపంలో విరాజిల్లిన శ్రీ వేణుగోపాల స్వామి భక్తుల కోర్కెలను తీర్చి, సకల శుభాలు, ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆశీర్వదించినట్లుగా భక్తులు భావించి పరవశించి పోయారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ ధర్మయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ చెంగల్రాయులు, అర్చకులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
