ముంబై : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన ప్రకటన చేసింది. శనివారం అధికారికంగా ఐసీసీ టోర్నీలను గెలుపొందిన జట్లను సన్మానించనున్నట్లు వెల్లడించింది. ఇదే క్రమంలో కల్నల్ సీకే నాయుడు అవార్డుకు మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ను ఎంపిక చేసినట్లు తెలిపింది. మహిళల క్రికెట్ విభాగంలో భారత దేశానికి ఎనలేని సేవలు అందించడం కాకుండా జాతి గౌరవాన్ని ఇనుమడింప చేసేలా ఆడిన హైదరాబాద్ కు చెందిన భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కు అరుదైన గౌరవంతో సత్కరించనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ‘మహిళల విభాగంలో బీసీసీఐ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని’ అందుకోనున్నారని వెల్లడించింది.
ఇక ఇతర అవార్డు గ్రహీతలలో, ‘ఉత్తమ మహిళా క్రికెటర్ (దేశవాళీ)’ విభాగంలో ఇరా జాదవ్ ‘జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ’ని అందుకోనుండగా, ‘సీనియర్ దేశవాళీ వన్-డే’ ఫార్మాట్లో ఉత్తమ మహిళా క్రికెటర్గా షఫాలీ వర్మను సత్కరించనున్నట్లు తెలిపింది బీసీసీఐ. దేశవాళీ పరిమిత ఓవర్ల పోటీలలో ‘ఉత్తమ ఆల్ రౌండర్’గా ఆయుష్ మత్రే ‘లాలా అమర్నాథ్ పురస్కారాన్ని’ అందుకోనుండగా, రంజీ ట్రోఫీలో ‘ఉత్తమ ఆల్ రౌండర్’గా విదర్భకు చెందిన హర్ష్ దూబే అవార్డును దక్కించు కోనున్నారు. ఈ సీజన్లో నాలుగు టైటిళ్లను గెలుచుకుని, రెండు పోటీలలో రన్నరప్గా నిలవడంతో, BCCI దేశవాళీ టోర్నమెంట్లలో ‘అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్ర సంఘం’గా ముంబై క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు పొందనుంది.

















