Lal Darwaza Bonalu : హైదరాబాద్ నగరాన్ని భక్తిశ్రద్ధలతో నింపిన బోనాల మహోత్సవం నేటితో ముగిసింది. ఆషాడ మాసం తొలి గురువారం గోల్కొండ కోటలో ప్రారంభమైన ఈ ఉత్సవం, నేడు పాతబస్తీ లాల్దర్వాజ (Lal Darwaza Bonalu) శ్రీ సింహవాహినీ మహంకాళి అమ్మవారి బోనాలతో ముగింపు చెందుతుంది.
Lal Darwaza Bonalu 2025 Updates
ఈ ఉదయం నుంచే ఆలయంలో మహాభిషేకం, ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బలిహరణం, అభిషేకాలు జరిపారు. ఆ తరువాత భక్తులు కోటికి ఎత్తుగా బోనాలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి.
ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో, పూలతో ఆకర్షణీయంగా అలంకరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కూడా అమ్మవారికి బోనం సమర్పించనున్నారు.
భద్రతా చర్యలు, భక్తుల సౌకర్యాలు
బోనాల సందర్బంగా నగరవ్యాప్తంగా పోలీసులు పటిష్ట భద్రతను కల్పించారు. దాదాపు 2,500 మంది పోలీసులను భద్రతా చర్యల కోసం నియమించారు. ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉత్సవాన్ని పర్యవేక్షిస్తున్నారు. నగర, జిల్లా పోలీసుల సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతోపాటు, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. గంటల తరబడి వేచి ఉన్న భక్తులు అమ్మవారి దర్శనం పొందేందుకు ఆతృతగా కనిపించారు.
రాజకీయ నాయకుల సందర్శన
బోనాల ఉత్సవానికి పార్టీలకతీతంగా నాయకులు హాజరయ్యారు. అమ్మవారి దర్శనం భాగ్యంగా భావిస్తున్నామంటూ భక్తిగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. బీజేపీ మహిళా నేత మాదవీ లాత మాట్లాడుతూ, “అమ్మవారిని దర్శించుకోవడం మనసుకు చాలా ఆనందాన్ని కలిగించింది,” అన్నారు.
లాల్దర్వాజ బోనాలతో ముగిసిన ఈ ఉత్సవాలు, హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయాల ప్రతిరూపంగా నిలిచాయి. భక్తుల విశ్వాసానికి కేంద్రబిందువైన ఈ బోనాలు, నగరంలో అఖండ ఆధ్యాత్మికతను చాటిచెప్పాయి.
Also Read : Lal Darwaza Bonalu Interesting : భాగ్య నగరంలో అంగరంగ వైభవంగా ‘లాల్ దర్వాజా బోనాల’ శోభాయాత్ర
