పశ్చిమ బెంగాల్ : కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. పశ్చిమ బెంగాల్ లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు . సీఎం మమతా బెనర్జీని ఏకి పారేశారు. రాష్ట్రంలో టీఎంసీ సర్కార్ హయాంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని అన్నారు. ప్రధానంగా మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు షా. ఇప్పుడే నేను మమతా దీదీ ప్రసంగాన్ని చూశాను. టీఎంసీ లేకపోతే మెజారిటీ వర్గం బతకలేదని చెబుతూ ఆమె ఇక్కడి మెజారిటీ వర్గాన్ని భయపెడుతున్నారంటూ ఆరోపించారు. ఈ పాలనలో ముర్షిదాబాద్లో అల్లర్లు, రామ నవమిపై దాడులు, సరస్వతీ పూజపై నిషేధం ఉన్నాయన్నారు. మరి అప్పుడు ఆమె ఎక్కడికి వెళ్లారు అని ప్రశ్నించారు.
సరిహద్దు కంచె కోసం టీఎంసీ భూమి ఇవ్వడం లేదని ఆరోపించారు కేంద్ర మంత్రి. బీఎస్ఎఫ్కు టీఎంసీ భూమి ఇవ్వక పోవడం దారుణమన్నారు. అయితే పశ్చిమ బెంగాల్లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 45 రోజుల్లోగా, రాష్ట్ర సరిహద్దు వెంబడి కంచె కోసం భూమి ఇస్తామని ప్రకటించారు. మేము అక్రమ వలసదారులను పశ్చిమ బెంగాల్ నుంచే కాకుండా యావత్ దేశం నుంచి తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. మయూరేశ్వర్లోని పల్లి మంగళ్ క్లబ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు కేంద్ర మంత్రి. ఆర్.జి. కార్ అత్యాచార కేసు తర్వాత, రాత్రి 7 గంటల తర్వాత మహిళలు బయటకు రాకూడదని బెనర్జీ చేసిన వ్యాఖ్యలను షా తీవ్రంగా ఖండించారు. ఇన్నేళ్ల పాటు సీఎంగా ఉండి ఏం చేశారంటూ మండిపడ్డారు.
