హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విచారణలో తాను తప్ప ఏ రావూ లేడన్నారు. విచిత్రం ఏమిటంటే
వరినో ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావు అనే వారిని తీసుకొచ్చి నా ఎదురుగా కూర్చోబెట్టి నన్ను విచారించారు అని మీడియాలో లీకులు ఇచ్చారని మండిపడ్డారు. ఇలాంటి కట్టు కథలు అల్లవద్దని, అవాస్తవాలు ప్రచారం చేయొద్దని సూచించారు కేటీఆర్. అక్కడ తారక రామారావు, పోలీసులు తప్ప ఏ రాధా కిషన్ రావు, ఇంకో రావు లేడని అన్నారు. బీఆర్ఎస్ నేతల, సొంత మంత్రుల ఫోన్లను రేవంత్ ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేయడం లేదా అని ప్రశ్నించారు.
వ్యక్తిత్వ హననానికి పాల్పడటం మీ ఉద్దేశమా అని మండిపడ్డారు. టీవీ సీరియల్ లా ఎన్నాళ్లు విచారణ జరుపుతారంటూ ఫైర్ అయ్యారు. మాకు ఇచ్చిన వాళ్లే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకూ ఎలక్ట్రోరల్ బాండ్లు ఇచ్చారని అన్నారు. మరి వారి సంగతి ఏంటి అని ఫైర్ అయ్యారు కేటీఆర్. డొల్ల కేసు అని తెలిసినా.. ‘ట్యాపింగ్’ తీగ లాగేందుకు ఆపసోపాలు పడుతున్న సిట్ అధికారులకు ఏడు గంటలపాటు సాగిన కేటీఆర్ విచారణ కొరుకుడు పడని అంశంగా మిగిలింది. సాధారణంగా అడిగే డాక్యుమెంటెడ్ ప్రశ్నలకు అదనంగా.. కేటీఆర్ విచారణాధికారులను రివర్స్లో ప్రశ్నలు అడగడం కొసమెరుపు.
రెండేండ్లుగా లీకులతో ప్రభుత్వం, రాతలతో దాని వందిమాగధ మీడియా తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుండటాన్ని.. సరైన వేదిక చూసుకుని కేటీఆర్ సూటిగా అడిగేశారు. విచారణాధికారులను వరుసపెట్టి ప్రశ్నలతో కడిగేశారు. మంత్రుల, బీఆర్ఎస్ నేతల ఫోన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాప్ చేయడం సహా పలు అంశాలపై కేటీఆర్ నిలదీతతో సిట్ అధికారులు ఇరకాటంలో పడ్డారు. సమాధానం చెప్పలేని తడబాటుతో.. తమకు సంబంధం లేదంటూ దాటవేశారు.















