Kandula Durgesh : అమరావతి – కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాస్కి పథకం క్రింద వైఎస్సార్ కడప జిల్లాలో రూ. 78 కోట్లతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక గండికోట పర్యాటక ప్రాజెక్టుకు ఆగస్టు 1న సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన జరుగనుందని మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) స్పష్టం చేశారు. బుధవారం నిడదవోలులో మంత్రి దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. జమ్మలమడుగులో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తయిన అనంతరం మధ్యాహ్నం గండికోట ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఆగస్టు 2,3 తేదీల్లో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
Minister Kandula Durgesh Comments
తద్వారా అక్కడున్న ఔత్సాహిక పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించి పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు కందుల దుర్గేష్ (Kandula Durgesh). అంతేగాక నవంబర్ 14, 15వ తేదీన వైజాగ్ లో పార్ట్ నర్ షిప్ సమ్మిట్ నిర్వహించాలని సీఎం నిర్ణయించినట్లు తెలిపారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కమిటీకి ఛైర్మన్ గా మంత్రి లోకేష్, ఇతర సభ్యుల్లో తాను ఒకడినని చెప్పారు. తద్వారా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లను రాష్ట్రానికి ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో టూరిజం సెక్టార్ లో కొత్త పెట్టుబడులు తీసుకు రావడానికి పార్ట్ నర్ షిప్ సమ్మిట్ ఉపకరిస్తుందన్నారు.
ఏపీలో గతంలో సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో పార్ట్ నర్ షిప్ సమ్మిట్ ప్రతి ఏటా జరిగేదని గుర్తు చేశారు. వైజాగ్ లో జరిగిన అనేక సమ్మిట్ లలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సీఎం సహకార హస్తాన్ని అందుకొని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారన్నారు. గడిచిన ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏనాడు కూడా పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు ఇచ్చే విధానాన్ని అవలంభించ లేదన్నారు. పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామన్న ఆలోచన చేయలేదన్నారు. ఏదో మొక్కుబడిగా ఒకసారి సమావేశం నిర్వహించి మమ అనిపించారని గుర్తు చేశారు.
Also Read : Minister Jitin Prasada Interesting : 2.79 లక్షల మందికి నైపుణ్య శిక్షణ – జితిన్
















