చిత్తూరు జిల్లా : పరిశ్రమల రాకతో ఈ ప్రాంతంలోని యువతకు పెద్ద ఎత్తున జాబ్స్ వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు నారా భువనేశ్వరి. గుడిపల్లి మండలం పెద్ద కోటమకనపల్లి గ్రామంలో పర్యటించారు.
మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. చంద్రబాబుని 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కుప్పం ప్రజలకు రుణపడి ఉంటాం అన్నారు. ముఖ్యమంత్రి బిజీగా ఉండటంతో ప్రతి మూడు నెలలకు ఒకసారి నేను కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తున్నాను అని తెలిపారు. రాష్ట్రాన్ని బాగుచేయడం చంద్రబాబు వల్లే సాధ్యమని ప్రజలు నమ్మి ఓటేశారని అన్నారు. కుప్పం నియోజకవర్గానికి రూ. 7,121 కోట్ల విలువైన పెట్టుబడులతో 17 పరిశ్రమలు తీసుకొచ్చారని చెప్పారు.
వీటి ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందన్నారు. కుప్పంలో అడిడాస్ కంపెనీ ఫుట్ వేర్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తోందని తెలిపారు. కుప్పంలో సోలార్ ఎనర్జీ వినియోగం పెంచేందుకు చర్యలు చేపట్టారని అన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. కుప్పం డిగ్రీ కాలేజ్ లో జాబ్ మేళా సందర్భంగా 5 వేల ఉద్యోగాల కల్పనకు పలు కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం కింద 37, 824 మంది లబ్ధి పొందుతున్నారని చెప్పారు నారా భువనేశ్వరి. 42, 232 మందికి తల్లికి వందనం అందుతోందని అన్నారు.
స్వచ్ఛ కుప్పంలో భాగంగా చెత్త నుంచి సంపద సృష్టించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రహదారుల నిర్మాణం చేపట్టారు. స్వర్ణ కుప్పంలో భాగంగా సీసీ, బీటీ రోడ్లు వేస్తున్నారు. సంజీవని హెల్త్ క్లినిక్స్ ద్వారా పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నారు. కుప్పానికి హంద్రినీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకొచ్చారు. గతంలో కొందరు చంద్రబాబు గారిపై నిందలు మోపారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. యావత్ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు గారికి అండగా నిలబడ్డారు.
