అహ్మదాబాద్ : ఐసీసీ టి20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని టీం ఇండియా. ఎవరూ ఊహించని రీతిలో ప్రత్యర్థి జట్టును 96 పరుగుల భారీ తేడాతో ఓడించింది. చరిత్రను తిరగ రాసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 255 రన్స్ చేసింది. అనంతరం 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కీవీస్ 19 ఓవర్లలోనే చాప చుట్టేసింది. బ్యాటింగ్ పరంగా భారత ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. సంజు శాంసన్ 89 పరుగులతో సత్తా చాటితే , అభిషేక్ శర్మ 52 , ఇషాన్ కిషన్ 54, శివమ్ దూబే 26 పరుగులతో రెచ్చి పోయారు.
అనంతరం న్యూజిలాండ్ బ్యాటర్లు భారత బౌలర్లను ఎదుర్కోలేక చతికిలపడ్డారు. ముఖ్యంగా ఇండియాకు చెందిన స్పీడ్ స్టర్ గా పేరు పొందిన జస్ప్రీత్ బుమ్రా దుమ్ము రేపాడు. చుక్కలు చూపించాడు. తను 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్లు కూల్చాడు. దీంతో భారత్ విజయం సునాయాసమైంది. మొన్న సెమీస్ లో సైతం సత్తా చాటాడు. ఈ తరానికి ఇలాంటి బౌలర్ ఒక్కడే ఉంటాడని కితాబు ఇచ్చాడు సంజు శాంసన్. తాజాగా తను కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బుమ్రాను ఆకాశానికి ఎత్తేశాడు. తను భారత దేశానికి జాతీయ సంపద అని పేర్కొన్నాడు.
















