తాడేపల్లి గూడెం : టీడీపీ శ్రేణుల చేతుల్లో తీవ్రంగా దాడికి గురైన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ లను ఈనెల 4వ తేదీన బుధవారం పరామర్శించనున్నారు వైసీపీ బాస్, మాజీ సీఎం జగన్ రెడ్డి. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్సీ తలశిల రఘురాం వెల్లడించారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. టీడీపీ గూండాల దాడిలో విధ్వంసానికి గురైన ఆయన ఇంటిని పరిశీలించనున్నారు. తదుపరి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను కలుసుకుని వారిని పరామర్శిస్తారు. అలాగే శుక్రవారం ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్తో సహా ఆయన కుటుంబాన్ని జగన్ రెడ్డి పరామర్శించనున్నారు.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగిందన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత సీఎం నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు జగన్ రెడ్డి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉంది కదా అని తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, శ్రేణులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ మండిపడ్డారు జగన్ మోహన్ రెడ్డి. అంబటి రాంబాబు, జోగి రమేష్ లను కావాలని టార్గెట్ చేయడం మంచి పద్దతి కాదన్నారు.
