అమరావతి : మాజీ సీఎం జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్. సవిత. దమ్ముంటే అభివృద్దిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆధారాలతో సహా వెల్లడించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. పెనుకొండ అంబేద్కర్ జంక్షన్ అయినా, గోరంట్ల నిమ్మల కృష్ణప్ప థియేటర్ అయినా, కల్యాణ దుర్గమైనా…ధర్మవరమైనా…పులివెందులైనా ప్లేస్, టైమ్ మీరే డిసైడ్ చేయండి…అంతేగాని నోరుంది కదా అని మాట్లాడితే ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేను లోకల్ , పుట్టింది ఇక్కడే ,పెరిగింది ఇక్కడే, పోయేది ఇక్కడే.. నేనేంటో పెనుకొండ వాసులందరికీ తెలుసు. శత్రువు ఇంటికి వచ్చినా కాఫీ ఇచ్చి గౌరవమిస్తానని అన్నారు.
5 ఏళ్లలో జగన్ రెడ్డి ఏనాడైనా డీఎస్సీ నిర్వహించారా…రాష్ట్రంలో ఎక్కడైనా రోడ్డు వేశారా…జల్ జీవన్, జలధార అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారా..? చివరికి పులివెందులకు సాగునీరు ఇచ్చింది చంద్రబాబే… త్వరలో తాగునీరు కూడా ఇవ్వబోతున్నదీ మా నాయకుడేనంటూ పేర్కొన్నారు. మంత్రి సవిత సత్యసాయి జిల్లాలో పర్యటించారు. తనను గెలిపించిన పెనుకొండ నియోజక వర్గ వాసుల నమ్మకాన్ని నిలబెట్టు కుంటున్నానని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతే గ్రామాల్లో అడుగు పెడుతున్నానని అన్నారు సవిత. అభివృద్ధి కేరాఫ్ అడ్రాస్ కూటమి ప్రభుత్వమని స్పష్టం చేశారు. అక్టోబర్ నుంచి నూతన పెన్షన్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. త్వరలో ఇళ్ల స్థలాలు కూడా అంద జేయబోతున్నామని వెల్లడించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి కూటమి పార్టీ అభ్యర్థులను గెలిపించి, గొడ్డలి పార్టీకి గుణపాఠం చెప్పాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు.
శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గౌని వారి పల్లి పంచాయతీ మెయిన్ రోడ్డు నుంచి చెట్ల మురంపల్లి వరకు నాలుగు కిలోమీటర్ల మేర రూ.2.50 కోట్ల చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ గత ఎన్నికల్లో గోరంట్ల మండల వాసులు తనను అఖండ మెజార్టీ ఇచ్చారన్నారు. గౌని వారి పల్లి పంచాయతీ మెయిన్ రోడ్డు నుంచి చెట్ల మురంపల్లి వరకు రోడ్డు నిర్మించిన తరవాతే గ్రామానికి వస్తానని ఆనాడే చెప్పానని, ఇపుడు మాట నిలబెట్టుకున్నానని అన్నారు. రెండేళ్ల కూటమి పాలనలో అభివృద్దిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు. అన్ని గ్రామాల్లోనూ రహదారులు, సీసీ డ్రైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నామన్నారు.
















