విశాఖపట్నం : వైజాగ్ వేదికగా జరిగిన కీలకమైన రెండవ టి20 మ్యాచ్ లో భారత మహిళా జట్టు దుమ్ము రేపింది. ప్రత్యర్థి జట్టు శ్రీలంక మహిళా జట్టుకు చుక్కలు చూపించింది. ముంబై వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సత్తా చాటిన షఫాలీ వర్మ మరోసారి విశాఖ మైదానంలో చెలరేగింది. కళ్లు చెదిరే షాట్స్ తో అలరించింది. లంక బౌలర్లకు షాక్ ఇచ్చింది. షఫాలీ వర్మ 69 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది.
శ్రీలంక జట్టును 128 పరుగులకే కట్టడి చేసింది. ముందున్న లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఓపెనింగ్ కు వచ్చిన భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన నిరాశ పరిచింది. తను కేవలం 14 రన్స్ కే పెవిలియన్ బాట పట్టింది. దీంతో తన ఆట తీరును మార్చేసింది. ఎడా పెడా దంచి కొట్టడం ప్రారంభించింది షఫాలీ వర్మ.
ఇదిలా ఉండగా శ్రీలంక జట్టు బౌలర్ ఆటపట్టు వేసిన 6వ ఓవర్ లో ఏకంగా 14 రన్స్ చేసింది. 4,6,4 తో రెచ్చి పోయింది . వర్మతో పాటు జెమీమా రోడ్రిగ్స్ 26 రన్స్ చేయగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 10 పరుగులు చేశారు. గిహ్మాని ఓవర్ లో మరో రెండు ఫోర్లు కొట్టింది వర్మ. చివరకు మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. అంతకు ముందు శ్రీలంక ముందు బ్యాటింగ్ చేసింది. భారత జట్టు మహిళా బౌలర్లు సత్తా చాటారు. శ్రీ చరణి 23 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీస్తే వైష్ణవి శర్మ 32 పరుగులు ఇచ్చి మరో 2 వికెట్లు కూల్చింది. దీంతో ప్రస్తుతం భారత జట్టు 2-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది.



















