మహిళల ప్రపంచ కప్ ఫైనల్ కు దూసుకు వెళ్లింది భారత మహిళా జట్టు. జెమీమా రోడ్రిగ్స్ సెన్సేషన్ సెంచరీతో కదం తొక్కింది. ప్రత్యర్థి ఆస్ట్రేలియా విసిరిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించింది. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ కు చుక్కలు చూపించింది. 5 వికెట్ల తేడాతో ఓడించింది. నేరుగా వరల్డ్ కప్ ఫైనల్ లో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 339 పరుగుల టార్గెట్ ముందుంచింది టీమిండియా ముందు. అనంతరం మైదానంలోకి దిగిన భారత జట్టు 48.3 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. భారీ టార్గెట్ ను ఛేదించింది. జెమీమా రోడ్రిగ్స్ 127 రన్స్ చేసింది. నవంబర్ 2న జరిగే ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనుంది భారత్.
జెమిమా రోడ్రిగ్స్ తన కెరీర్ లో అత్యుత్తమమైన ఇన్నింగ్స్ ఆడింది. 134 బంతుల్లో సెంచరీ నమోదు చేసింది ఏడుసార్లు ఛాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియాకు ఝలక్ ఇచ్చింది. ఇక కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడింది. తను 88 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు , 2 సిక్సర్లతో 89 రన్స్ చేసింది. జెమీమా కౌర్ తో కలిసి 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జెమీమా ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా మహిళల వన్డే ఫార్మాట్ లో అత్యధిక పరుగులను ఛేదించడంలో ఇదే రికార్డ్ కావడం విశేషం. ఇక స్మృతీ మంధన్నా 10 ఓవర్ లో నిష్క్రమించింది. అయినా ఎక్కడా తడబడకుండా మ్యాచ్ ను పూర్తి చేశారు.



















