Free Wifi : భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా రైల్వే మంత్రిత్వ శాఖ మరో కీలక ముందడుగు వేసింది. దేశంలోని 6,115 రైల్వే స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వై-ఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలు ఇప్పటికే న్యూఢిల్లీ, ముంబయి, అహ్మదాబాద్, కాచిగూడ, సికింద్రాబాద్ వంటి ప్రధాన రైల్వే స్టేషన్లతో పాటు అనేక ప్రాంతీయ స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయి.
ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) రాజ్యసభలో లిఖిత పూర్వకంగా వెల్లడించారు. సభ్యురాలు స్వాతి మలివాల్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి ఈ వివరాలు ఇచ్చారు. ప్రయాణికులకు నాణ్యమైన డేటా కనెక్టివిటీ, హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలన్న లక్ష్యంతో ఈ వై-ఫై సేవలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
Free Wifi – రైల్టెల్ సహకారంతో సేవలు
ఈ సేవలను భారత ప్రభుత్వానికి చెందిన రైల్టెల్ కార్పొరేషన్ లిమిటెడ్ అందిస్తోంది. టెలికాం సేవలందించే సంస్థల సహకారంతో 4G/5G కవరేజ్ కలిగిన స్టేషన్లలో ప్రయాణికులు తమ మొబైల్ పరికరాల ద్వారా వై-ఫై సేవలను వినియోగించుకోవచ్చు.
వై-ఫై సేవల వినియోగ విధానం:
ఉచిత వై-ఫై సేవలను పొందాలంటే:
- మీ మొబైల్ ఫోన్లో Wi-Fi ఆన్ చేయాలి.
- అందుబాటులో ఉన్న ‘RailWire’ నెట్వర్క్ను ఎంచుకోవాలి.
- మొబైల్ నంబర్ నమోదు చేయాలి.
- వచ్చే OTPని నమోదు చేయగానే, హైస్పీడ్ ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు.
ప్రయోజనాలు
ఈ సేవల ద్వారా ప్రయాణికులు రైల్వే స్టేషన్ ప్రాంగణంలోనే సినిమాలు, పాటలు, ఆటలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే అత్యవసర ఆఫీస్ పనులను సైతం పూర్తిచేసుకునే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వనరులు లేని ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
దేశవ్యాప్తంగా రైల్వే నెట్వర్క్ను డిజిటలైజ్ చేయడంలో ఈ చర్య ప్రధాన భాగంగా మారనుంది. ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరిచే ఈ సదుపాయం ద్వారా డిజిటల్ ఇండియా లక్ష్యం వేగంగా చేరుకోవచ్చని కేంద్రం భావిస్తోంది.
Also Read : Today Gold Price : స్వల్పంగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు


















