హైదరాబాద్ : హైడ్రా హైదరాబాద్ నగరంలో ఫైర్ సేఫ్టీపై దృష్టి సారించింది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటోంది. వ్యాపార సముదాయాల నుంచి నివాస ప్రాంతాల వరకూ ఫైర్ సేఫ్టీలో ఎక్కడా అలసత్వాన్ని ఉపేక్షంచరాదని హైడ్రా నిర్ణయించింది. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాల నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకునేందుకు నడుం బిగించింది. జీహెచ్ ఎంసీ, ఫైర్, విద్యుత్ విభాగాల అధికారులతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమావేశమయ్యారు. ఫైర్ సేఫ్టీ కార్యాచరణ గురించి వివరించారు. వ్యాపార సముదాయాలు, ఫర్నీచర్, వస్త్ర దుకాణాలు ఇలా అన్ని చోట్లా తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఫైర్ సేఫ్టీ పాటించకపోతే ఆయా షాపులను సీజ్ చేయాలని నిర్ణయించారు.
వెనువెంటనే విద్యుత్ సరఫరా బంద్ చేయాలని, ఫైర్ సేఫ్టీ లేని వ్యాపార సముదాయంగా.., షాపుగా పేర్కొంటూ నోటీసులు అతికించాలని ఆదేశించారు. నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదానికి ఆస్కారం ఉన్న పరిస్థితులుంటే వెంటనే హైడ్రా కంట్రోల్ రూం నంబరు 9000113667 కు ఫోను చేసి సమాచారం ఇవ్వాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నగర ప్రజలను కోరారు. ఎక్కడ అగ్ని ప్రమాదానికి అవకాశం ఉన్న పరిస్థితులున్నాయో కరెంటు లొకేషన్తో పాటు.. వీడియోలు, ఫొటోలు పంపించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. నగరంలోని అందరి లక్ష్యం అగ్ని ప్రమాదాలు తగ్గించడమే కావాలని కోరారు. గతేడాది నగరంలో జరిగిన అగ్ని ప్రమాదాలు 36కు పైగా ఉన్నాయని.. నెలకు 3 చొప్పున ఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు.
