హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి కేటాయించేందుకే ఇలా చేశారంటూ తాము ఆధారాలతో బయట పెట్టామన్నారు. ఈ సందర్బంగా ఆయన సూటిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని చెప్పకుండా బీటింగ్ అరౌండ్ ద బుష్ లా ఏదో చెప్పి, మసిబూసి మారేడు కాయ చేశారంటూ ఆరోపించారు. మీరెన్ని సాకులు చెప్పినా మీ కాంగ్రెస్ పాలనలో బొగ్గు కుంభకోణం జరిగిందనేది నిజం అని స్పష్టం చేశారు. అందులో రేవంత్ రెడ్డి బామ్మర్ది రింగ్ మెన్ గా పాత్ర పోషించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు హరీశ్ రావు.
నేను సూటిగా అడుగుతున్నా ఏ స్కాం జరగకుంటే నైనీ టెండర్లను రద్దు చేస్తున్నట్లు ఎందుకు ప్రకటించారంటూ నిలదీశారు. నిన్న నేను బయటపెట్టిన మరో కుంభకోణం.. సోలార్ పవర్ స్కాం గురించి ఎందుకు ఒక్క మాట కూడా నేటి ప్రెస్ మీట్ లో మాట్లాడ లేదన్నారు. నైనీని రద్దు చేసినట్లే మిగతా అన్ని టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనను బిఆర్ఎస్ మీద నెట్టే ప్రయత్నం చేయడం వల్ల నిజాలు అబద్దాలు అయిపోవు, జరిగిన స్కాంలు, స్కీంలుగా మారిపోవు అన్నారు. సైట్ విజిట్ నిబంధనను 2018లోనే మొదలైందని చెప్పి, దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉదాహరణలుగా చెప్పి ఏం చెప్పదలుచుకున్నారని ప్రశ్నించారు. అది తప్పు కాకుంటే నైనీ ఎందుకు రద్దు చేసినట్లు అనేది చెప్పాలన్నారు.
