Hydraa : హైదరాబాద్ : కబ్జాలు జరుగుతుంటే నగర ప్రజలు చూస్తూ ఊరుకోవడం లేదు. నేరుగా హైడ్రా కార్యాలయానికి వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారు. రహదారి బంద్ అయితే ఫొటోలు తీసి మరీ చూపిస్తున్నారు. చెరువుల్లో ఆక్రమణలు జరుగుతుంటే వీడియోలు పెడుతున్నారు. ఎవరెవరికి ఫిర్యాదు చేశారో కూడా చెప్పి సాక్ష్యాలను చూపిస్తున్నారు. దశాబ్దాల నాటి సమస్యలకు గంటల్లో, రోజుల్లో పరిష్కారం చూపుతున్నారంటూ హైడ్రాకు (Hydraa) కితాబిస్తున్నారు. ఆ నమ్మకంతో వస్తున్నామంటూ పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా హైడ్రా ప్రజావాణికి 52 ఫిర్యాదులందాయి. చాలా మంది బాహాటంగా ఫిర్యాదు చేస్తుంటే.. మరి కొంతమంది తమ వివరాలు బయట పెట్టవద్దని విచారణాధికారులకు సూచిస్తున్నారు.
Hydraa Gets Complaints
బాలానగర్ మండలం కూకట్పల్లిలోని హస్మత్పేట విలేజ్లో ప్రభుత్వానికి చెందాల్సిన 10 ఎకరాలు కబ్జా చేసేస్తున్నారంటూ హైడ్రాకు ఫిర్యాదు అందింది. తూములు మూసేసి.. అలుగులు ఎత్తు పెంచడంతో చెరువు పై భాగంలో ఉన్న భూములు, లే ఔట్లు నీట మునగుతున్నాయని కొంతమంది, చెరువుల్లో మట్టి పోసి ఎకరాల కొద్దీ కబ్జా చేస్తున్నారంటూ మరికొంతమంది ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నేరుగా పరిశీలించి సంబంధిత అధికారులకు పరిష్కార బాధ్యతలను అప్పజెప్పారు.
శంషాబాద్ మండలంలోని పెద్ద గోల్కొండ గ్రామం పరిధిలోని సరసింహకుంట తూములు మూసేసి, అలుగు ఎత్తు పెంచడం వల్ల ఎఫ్టీఎల్ కంటే ఎక్కువ నీరు నిలిచి తమ పంట పొలాలు మునిగి పోయాయని ఆ గ్రామ ప్రజలు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వాస్తవంగా చెరువు ఎంత విస్తీర్ణంలో ఉందో అంతే నీరు నిండేలా చూసి తమ పొలాలను రక్షించాలని కోరారు. చెరువు స్థాయికి మించి నిండడంతో ఆ నీరు ఔటర్ రింగు రోడ్డు ఎగ్జిట్ 15 వద్ద సర్వీసు రోడ్డును ముంచెత్తుతోందని.. దీంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read : DY CM Pawan Kalyan Important Update : మొంథా తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

















