Home Minister Anitha : అమరావతి – వర్షాలు భారీగా కురుస్తుండడంతో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha). బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాలపై శుక్రవారం సమీక్ష చేపట్టారు. వాయుగుండం ఈరోజు పశ్చిమ బెంగాల్, ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ తీరాలను తాకే అవకాశం ఉందని ఇప్పటికే రాష్ట్ర వాతావరణ శాఖ ప్రకటించిందని తెలిపారు. రానున్న 24 గంటల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ వైపుగా కదులుతుందన్నారు. ఈ సందర్బంగా విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ప్రఖర్ జైన్, సిబ్బందితో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు వంగలపూడి అనిత.
Home Minister Anitha Key Orders
ఏపీ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి స్వయంగా పరిశీలించారు. అత్యవసర సహాయక చర్యలకు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు. తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు అనిత వంగలపూడి.
సముద్రం అలజడిగా ఉంటుందని, అత్యవసరం అయితే తప్పా బయటకు రావద్దని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీరాల్లో అలలు 2.9 నుంచి 3.6 మీటర్ల ఎత్తులో ఎగసిపడే ప్రమాదం ఉందన్నారు వంగలపూడి అనిత.
సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళ వద్దని కోరారు. వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాద హాట్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు.
Also Read : Popular Actor Kamal Haasan : రాజ్యసభ ఎంపీగా కొలువు తీరిన కమల్ హాసన్

















