హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( హెచ్ సీ ఏ) కీలక ప్రకటన చేసింది. యువ క్రికెటర్లకు పోటీతత్వంతో కూడిన వేదికను కల్పించడానికి , క్షేత్రస్థాయిలో క్రికెట్ అభివృద్ధిని ప్రోత్సహించడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వచ్చే నెలలో ఇంటర్-స్కూల్ , ఇంటర్-కళాశాల క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించనుంది. ఈ టోర్నమెంట్లో గరిష్టంగా 120 జట్లు పాల్గొనవచ్చు . కాగా తుది జట్ల సంఖ్య అనేది వచ్చే దరఖాస్తులు , నిర్దేశిత అర్హత, నమోదు నిబంధనల పూర్తిపై ఆధారపడి ఉంటుందని హెచ్ సీ ఏ తెలిపింది. ఆగస్టు 24 ఉదయం 11 గంటల నుండి ఆగస్టు 26 వరకు దరఖాస్తులు స్వీకరించ నున్నట్లు వెల్లడించింది. ప్రతి పాఠశాల లేదా కళాశాల రూ. 2,000 ప్రవేశ రుసుము (ఎంట్రీ ఫీజు) చెల్లించి నమోదు చేసుకోవచ్చు. ఈ రుసుమును హైదరాబాద్లోని ఉప్పల్లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని తమ కార్యాలయాల్లో దరఖాస్తు సమర్పించే సమయంలో నగదు రూపంలో చెల్లించాలని స్పష్టం చేసింది. నమోదు ప్రక్రియ ఖచ్చితంగా ముందు వచ్చిన వారికి ప్రాధాన్యత
పద్ధతిలో జరుగుతుంది.
ప్రతి పాఠశాల/కళాశాల తమ అధికారిక లెటర్హెడ్పై గరిష్టంగా 15 మంది ఆటగాళ్ల జాబితాను సమర్పించాలి. ఈ జాబితాలో ఆటగాళ్ల పూర్తి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ నంబర్, పాఠశాల అడ్మిషన్ నంబర్ , చదువుతున్న తరగతి వంటి వివరాలు ఉండాలి. అలాగే, దీనిపై ప్రిన్సిపాల్ లేదా సంస్థ అధిపతి సంతకం, పాఠశాల/కళాశాల అధికారిక ముద్ర (స్టాంప్/సీల్) తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది హెచ్ సీఏ. ఆటగాళ్ల నమోదు పూర్తయి ఆమోదించబడిన తర్వాత, టోర్నమెంట్ నిబంధనల ప్రకారం ఎటువంటి రద్దు లేదా మార్పులకు అనుమతి ఉండదు అని పేర్కొంది. ప్రతి పాఠశాల లేదా కళాశాల తరపున దరఖాస్తును సమర్పించడానికి కేవలం ఒక అధికారిక ప్రతినిధికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది. 1-9-2010 నుంచి 31-8-2012 మధ్య జన్మించిన ఆటగాళ్లు ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి అర్హులు అని వెల్లడించింది.



















